Telangana: స్వర్ణం కొల్లగొట్టిన తెలంగాణ బాక్సర్​ హుస్సాముద్దీన్

  • జాతీయ పురుషుల బాక్సింగ్ లో విజేతగా హుస్సామ్
  • ఫైనల్లో 4–1తో రైల్వేస్ కు చెందిన సచిన్ పై గెలుపు
  • గతేడాది రజతం సాధించిన హుస్సాముద్దీన్
Telangana boxer hussamuddin clinches gold at national mens boxing championship

తెలంగాణ స్టార్ బాక్సర్ మహ్మద్‌ హుస్సాముద్దీన్‌ మరోసారి పసిడి పంచ్‌ విసిరాడు. జాతీయ బాక్సింగ్ చాంపియన్ షిప్ లో బంగారు పతకం సొంతం చేసుకున్నాడు. పురుషుల 57 కిలోల విభాగంలో అతను జాతీయ చాంపియన్‌గా నిలిచాడు. సర్వీసెస్ తరఫున పోటీ పడ్డ హుస్సామ్ తుది పోరులో 4–1తో 2016 ప్రపంచ యూత్‌ చాంపియన్‌ సచిన్‌ (రైల్వేస్‌)ను చిత్తు చేశాడు. ఇదే టోర్నీలో గతేడాది రజతంతో సరిపెట్టిన తెలంగాణ బాక్సర్ ఈ సారి స్వర్ణంతోనే తిరిగొచ్చాడు. 

పోటాపోటీగా జరిగిన తుది పోరులో అతను తొలి రౌండ్‌ నుంచే అద్భుత ప్రదర్శన చేశాడు. తన అనుభవాన్ని ఉపయోగించి బలమైన పంచ్ లు విసురుతూ ప్రత్యర్థి సచిన్‌ ను ఓడించాడు. భారత మరో స్టార్ బాక్సర్ అస్సాంకు చెందిన శివ థాపా కూడా బంగారు పతకం గెలిచాడు. 63.5 కిలోల విభాగంలో బరిలోకి దిగిన థాపా ఫైనల్లో 5–0తో అంకిత్‌ నర్వాల్‌ (రైల్వేస్‌)ను చిత్తు చేశాడు. ఈ టోర్నీలో హుస్సాముద్దీన్ ప్రాతినిథ్యం వహించిన సర్వీసెస్ జట్టు.. టీమ్ చాంపియన్ షిప్ సొంతం చేసుకుంది. ఆ జట్టుకు చెందిన బాక్సర్లు ఆరు స్వర్ణాలు సహా పది పతకాలు గెలిచారు.

More Telugu News