Mekathoti Sucharitha: నేనేదో సరదాగా అన్నానంతే.. వైరల్ వీడియోపై మేకతోటి సుచరిత

  • కాకుమానులో ఇటీవల చేసిన వ్యాఖ్యలు వైరల్
  • తన వ్యాఖ్యలను అపార్థం చేసుకున్నారని వివరణ
  • భర్త ఎక్కడుంటే భార్య అక్కడే ఉంటుందని చెప్పడంలో తప్పేముందని ప్రశ్న
YCP MLA Mekathoti Sucharitha Responds About Her Comments On Party Change

తానేదో సరదాగా చేసిన వ్యాఖ్యలను వైరల్ చేశారని ఏపీ మాజీ మంత్రి, ప్రత్తిపాడు ఎమ్మెల్యే మేకతోటి సుచరిత అన్నారు. గుంటూరు జిల్లా కాకుమానులో రెండు రోజుల క్రితం కార్యకర్తలతో సుచరిత మాట్లాడుతూ.. తాను ఓ భార్యగా భర్త అడుగుజాడల్లోనే నడవాల్సి ఉంటుందని, ఆయన పార్టీ మారి, తనను కూడా రమ్మంటే భార్యగా ఆయన వెంట వెళ్లాల్సి ఉంటుందని అన్నారు. 

తన భర్త దయాసాగర్ ఒక పార్టీలో, తాను మరో పార్టీలో, పిల్లలు ఇంకో పార్టీలో ఉండబోరని అన్నారు. ఒకే ఇంట్లో వేర్వేరు అభిప్రాయాలు ఉన్నంత మాత్రాన వారు వేరు కాదని పేర్కొన్నారు. వైసీపీలో మనగలిగినన్ని రోజులు ఉండాలని అనుకుంటున్నామని అన్నారు. ఈ వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. ఆమె పార్టీ మారబోతున్నారని చెప్పేందుకు ఈ వ్యాఖ్యలు సంకేతమంటూ ఎవరికి తోచిన విధంగా వారు భాష్యం చెప్పుకున్నారు. ఆమె వ్యాఖ్యలు ప్రధాన మీడియాలోనూ ప్రముఖంగా రావడంతో సుచరిత స్పందించారు.

కాకుమాను కార్యకర్తలతో తాను సరదాగా చేసిన వ్యాఖ్యలను అపార్థం చేసుకున్నారని అన్నారు. వీడియోను ఎవరో వైరల్ చేస్తే దానిని బ్రేకింగ్ న్యూస్‌గా వేయడం చూసి నవ్వొచ్చిందన్నారు. రాజకీయాలలో ఉంటే వైసీపీతోనే ఉంటానని, లేదంటే ఇంట్లో ఉంటానని స్పష్టం చేశారు. ఒకటే మాట, ఒకటే బాటగా ఉంటానని, ప్రజల్లో లేనిపోని అపోహలు కల్పించొద్దని కోరారు. భర్త ఎక్కడ ఉంటే భార్య అక్కడే ఉంటుందని చెప్పడంలో తప్పేముందని ప్రశ్నించారు. కాంగ్రెస్ నుంచి వైసీపీలోకి వెళ్తున్నప్పుడు తన భర్త దయాసాగర్‌కు చెబితే వెళ్లమన్నారని, దానిని గుర్తు చేసుకునే అలా మాట్లాడానని సుచరిత చెప్పుకొచ్చారు.

More Telugu News