హైదరాబాదులో చిన్నారుల్లో వైరల్ ఇన్ఫెక్షన్లు.. స్కూళ్లలో పడిపోయిన హాజరు

Hyderabad Rise in viral infection among children drop attendance in schools
  • ఏటా శీతాకాలంలో పిల్లల గైర్హాజరు 10-15 శాతమే
  • కానీ ఈ సీజన్ లో ఇది 30 శాతానికి పెరుగుదల
  • పాఠశాలల్లో హెల్త్ క్యాంప్ లు ఏర్పాటు చేయాలన్న డిమాండ్
చిన్నారులకు వైరల్ ఇన్ఫెక్షన్ల రిస్క్ పెరిగింది. ఫలితంగా హైదరాబాద్ లోని పాఠశాలల్లో హాజరు శాతం చెప్పుకోతగ్గ స్థాయిలో పడిపోయింది. ఆసుపత్రుల్లో చికిత్స కోసం వస్తున్న చిన్నారుల సంఖ్యలోనూ పెరుగుదల కనిపిస్తోంది. దీంతో పాఠశాలల్లో కరోనా పరీక్షలు నిర్వహించాలన్న డిమాండ్లు తల్లిదండ్రుల నుంచే కాదు, టీచర్ల నుంచి కూడా వ్యక్తం అవుతుండడం గమనార్హం.

గత రెండు వారాల్లో పాఠశాలల్లో పిల్లల గైర్హాజరు శాతం 30 శాతంగా ఉంటోంది. నిత్యం 80 మంది వరకు చిన్నారులు జలుబు, జ్వరంతో ఆసుపత్రిలో చేరుతున్నారు. గతేడాదితో పోలిస్తే కేసుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్టు వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా పిల్లల్లో ఇన్ఫెక్షన్లు ఎక్కువ రోజులపాటు ఉంటున్నాయి. వారిలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటోంది. అలాగే, వారిని సిటీ టూర్ కు తీసుకెళుతుండడం వల్ల నీరు మారి సులభంగా అలెర్జీకి గురవుతున్నారు.

ఏటా శీతాకాలలో పాఠశాలల్లో పిల్లల హాజరు శాతం తగ్గడం సాధారణమే. కానీ ఇది 10-15 శాతంగానే ఉంటుందని, ఈ ఏడాది రెట్టింపు శాతంలో పిల్లల గైర్హాజరు ఉన్నట్టు పాఠశాలలు చెబుతున్నాయి. ప్రతి నెలా స్కూళ్లలో హెల్త్ క్యాంప్ లు ఏర్పాటు చేయాలన్న డిమాండ్ తల్లిదండ్రుల నుంచి వినిపిస్తోంది. 

కరోనా వచ్చిన తర్వాత భౌతికంగా స్కూళ్లలో తరగతులను పూర్తి స్థాయిలో నిర్వహించడం ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచే అన్న విషయం తెలిసిందే. కరోనా ఎండెమిక్ గా మారి, స్వల్ప స్థాయిలో వ్యాప్తిలో ఉన్నది కూడా వాస్తవం. ఈ క్రమంలో పిల్లల్లో వచ్చే అనారోగ్యాలు అలెర్జీలతోనా, లేక కరోనా లేదా మరో వైరస్ తోనా అన్నది తెలియడం లేదు. పరీక్షలతోనే ఇది తెలిసే అవకాశం ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
Go Back to Shorts
viral infections
Hyderabad
children
drop attendance
schools

More Telugu News