vehicles: పాత కార్ల అమ్మకాలపై కీలక మార్పులు చేసిన కేంద్రం

  • ఇకపై వాహనాల విక్రయాలు సులువయ్యేలా నిబంధనల మార్పు
  • నేరుగా డీలర్లతో క్రయవిక్రయాలు జరుపుకునే అవకాశం 
  • ఏప్రిల్1వ తేదీ నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి
Rules change for used vehicles

కార్లు సహా పాత వాహనాల అమ్మకాలు ఇకపై సులుభతరం కానున్నాయి. పాత వాహనాల క్రయవిక్రయాల్లో ఇబ్బందులను తొలగించేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధలను తీసుకొచ్చింది. దీని ప్రకారం పాత వాహనదారులు కొనేవారు, అమ్మేవారు ఇకపై రిజిష్టర్డ్ డీలర్లను సంప్రదిస్తే చాలు. డీలర్ ప్రామాణికతను గుర్తించేందుకు నమోదిత వాహనాల డీలర్లకు ధ్రువీకరణ పత్రాలను జారీ చేసే విధానాన్ని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ తీసుకొచ్చింది. ఈ నిబంధనలు వచ్చే ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయి. అప్పటి నుంచి పాత యజమానుల తరఫున అధీకృత డీలర్లే క్రయవిక్రయాలు జరపవచ్చు. ప్రస్తుతం యజమానే తన వాహన హక్కుల బదిలీని ఫామ్29 రూపంలో ఆర్టీఏ అధికారులకు సమర్పిస్తున్నారు. 

కొత్త నిబంధనలు అమల్లోకి వస్తే ఇకపై పాత యజమాని స్వయంగా ఫామ్29 అందించాల్సిన అవసరం లేదు. ఇందుకు బదులుగా తన వాహనాన్ని ఫలానా డీలర్ కు అప్పగిస్తున్నట్టు ఫామ్29సి ఆన్ లైన్ లో అధికారులకు సమర్పిస్తే సరిపోతుంది. వెంటనే ఒక అక్నాలెడ్జ్మెంట్ నంబర్ వస్తుంది. ఆ నంబర్ ను ఉపయోగించి వాహనాలపై లావాదేవీలు నిర్వహించే అధికారం సంబంధిత డీలర్ కు దాఖలవుతుంది. రిజిస్ట్రేషన్, ఫిట్నెస్ సర్టిఫికెట్ల రెన్యువల్, డూప్లికేట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, నో అబ్జెక్షన్ సర్టిఫికెట్, ఇన్సూరెన్స్, యాజమాన్య హక్కుల బదిలీ అన్నీ డీలరు చేతుల మీదుగా నిర్వహించవచ్చు. ఒకవేళ డీలర నుంచి హక్కులు వెనక్కితీసుకోవాలంటే వాహన యజమాని ఫామ్–డిని సమర్పించాల్సి ఉంటుంది.

More Telugu News