Uttar Pradesh: యూపీలో విషాదం.. ఇంట్లో మంటలు చెలరేగి ఐదుగురు కుటుంబ సభ్యుల సజీవ దహనం

Uttar Pradesh House fire kills 5 members of a family
  • యూపీలోని మవు జిల్లాలో ఘటన
  • మృతుల్లో పురుషుడు, మహిళ, ముగ్గురు చిన్నారులు
  • ఒక్కొక్కరికీ రూ.4 లక్షల చొప్పున పరిహారం
ఉత్తరప్రదేశ్‌లోని మవు జిల్లాలో విషాదం నెలకొంది. ఓ ఇంట్లో మంటలు చెలరేగి ఐదుగురు కుటుంబ సభ్యులు సజీవ దహనమయ్యారు. మృతుల్లో ఓ మహిళ, పురుషుడు ఉండగా మిగతా ముగ్గురు పిల్లలు. షాపూర్ గ్రామంలో జరిగిందీ ఘటన. ఇంట్లోని స్టవ్ నుంచి మంటలు చెలరేగినట్టు ప్రాథమికంగా నిర్ధారించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, వైద్య సిబ్బంది, సహాయ బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టానికి తరలించారు. బాధితులు ఒక్కొక్కరికి 4 లక్షల రూపాయల చొప్పున పరిహారం ప్రకటించినట్టు జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

కాగా, ఈ నెల 11న జరిగిన ఇలాంటి ఘటనలోనే 25 ఏళ్ల మహిళ, ఆమె ముగ్గురు చిన్నారులు మంటలకు ఆహుతయ్యారు. కట్నం గొడవకు సంబంధించి ఆమె అత్తమామలే ఈ ఘాతుకానికి పాల్పడినట్టు ఆరోపణలున్నాయి. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్‌పూర్‌లో జరిగింది. 2018లో వివాహమైన ఆమెను ఆ తర్వాతి నుంచి అత్తమామలు కట్నం కోసం వేధిస్తున్నట్టు బాధితురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తులో ఉంది.
Uttar Pradesh
Mau district
Fire Accident

More Telugu News