YS Jagan: రేపటి నుంచి మూడ్రోజుల పాటు సీఎం జగన్ కడప జిల్లా పర్యటన

  • ఈ నెల 23 నుంచి 25 వరకు పర్యటన
  • వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్న సీఎం జగన్
  • కడప అమీన్ పీర్ దర్గా సందర్శన
  • పార్టీ నేతల కుటుంబాల్లో పెళ్లి వేడుకలకు హాజరు
  • సీఎస్ఐ చర్చిలో క్రిస్మస్ ప్రార్థనలు
CM Jagan three day tour in Kadapa district commence from tomorrow

ఏపీ సీఎం జగన్ ఈ నెల 23 నుంచి 25వ తేదీ వరకు కడప జిల్లాలో పర్యటించనున్నారు. మూడ్రోజుల పాటు సాగే ఈ పర్యటనలో ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. సీఎం జగన్ రేపు గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరి కడప విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ్నించి రోడ్డు మార్గంలో బయలుదేరి కడప అమీన్ పీర్ దర్గాను సందర్శిస్తారు. ఈ దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. 

అక్కడ్నించి ఏపీ పరిశ్రమల శాఖ సలహాదారు రాజోలి వీరారెడ్డి నివాసానికి వెళ్లనున్నారు. అనంతరం ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ అబ్బిరెడ్డి మల్లికార్జునరెడ్డి, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి అఫ్జల్ ఖాన్ ల కుటుంబాల్లో జరిగే వివాహ వేడుకలకు హాజరవుతారు. అక్కడ్నించి కడప ఎయిర్ పోర్టుకు వెళ్లి కమలాపురం చేరుకోనున్నారు. కమలాపురంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. అక్కడ వివిధ అభివృద్ధి పనులకు సంబంధించి శంకుస్థాపనలు చేయనున్నారు. ఈ కార్యక్రమం ముగిసిన అనంతరం సీఎం జగన్ ఇడుపులపాయ చేరుకుని రాత్రికి వైఎస్సార్ గెస్ట్ హౌస్ లో బస చేస్తారు. 

24వ తేదీ ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. అనంతరం ఇడుపులపాయ చర్చిలో జరిగే ప్రార్థనలకు హాజరవుతారు. ఆ తర్వాత... విజయ్ హోమ్స్ జంక్షన్, కదిరి రోడ్డు జంక్షన్, ఎక్స్ టెన్షన్ రోడ్డు, కూరగాయల మార్కెట్, మైత్రి లే అవుట్, రాయలపురం బ్రిడ్జి, డాక్టర్ వైఎస్సార్ బస్టాండ్ ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక్కడ ఏర్పాటు చేసే సభలో ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. అక్కడ్నించి అహోబిలపురం స్కూలు అభివృద్ధి పనులు, ఎంఎల్డీ ఎస్టీపీ, జీటీఎస్ పనులను ప్రారంభిస్తారు. 

ఈ నెల 25న క్రిస్మస్ సందర్భంగా పులివెందుల సీఎస్ఐ చర్చిలో జరిగే ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు. అనంతరం పులివెందుల నుంచి బయల్దేరి తాడేపల్లికి తిరిగి రానున్నారు.

More Telugu News