Nirmala Sitharaman: ఓ రాష్ట్ర ప్రభుత్వం దేశమంతా ప్రకటనలిస్తోంది.. ఉద్యోగులకు జీతాలు మాత్రం ఇవ్వడం లేదు: కేంద్రమంత్రి నిర్మల

  • రాజ్యసభలో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా నిర్మల వ్యాఖ్యలు
  • మీడియాలో వస్తున్న వార్తలనే ప్రస్తావిస్తున్నానన్న మంత్రి
  • ప్రకటనల వల్లే జీతాలు ఇవ్వలేకపోతుండొచ్చన్న నిర్మలమ్మ
One State in India not even giving salaries in time says Nirmala

దేశంలోని ఓ రాష్ట్రం ఉద్యోగులకు సకాలంలో వేతనాలు చెల్లించలేకపోతోందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. అయితే, ఉన్న డబ్బుతో మాత్రం దేశవ్యాప్తంగా భారీగా ప్రకటనలు ఇస్తోందని విమర్శించారు. రాజ్యసభలో ద్రవ్య వినిమయ బిల్లుపై నిన్న జరిగిన చర్చలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ఒక రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు సకాలంలో వేతనాలు చెల్లించలేకపోతోందని మీడియాలో వార్తలు వస్తున్నట్టు పేర్కొన్నారు. జీతాలు అందకపోవడంతో ఉద్యోగులు నిరసన కూడా తెలుపుతున్నారని అన్నారు. తాను ప్రత్యేకంగా ఆ రాష్ట్రం పేరును ప్రస్తావించడం లేదని, పత్రికల్లో వస్తున్న వార్తలను మీరూ చూడొచ్చని అన్నారు. 

ప్రభుత్వం వద్ద ఉన్న నిధులను దేశవ్యాప్తంగా వివిధ మీడియాల్లో ప్రకటనలు ఇచ్చేందుకు ఉపయోగించడం వల్ల ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని స్థితికి ఆ రాష్ట్రం చేరుకుని ఉండొచ్చన్నారు. కాబట్టి సబ్సిడీలు, ఉచితాల విషయంలో బేరీజు వేసుకోవాలని, ఎవరైనా వాటిని బడ్జెట్‌లో చూపిస్తే అందుకు తగిన నిధులు కేటాయించాలని సూచించారు. ఆదాయం వస్తుంటే డబ్బులు ఇవ్వడంలో ఎవరికీ ఎలాంటి అభ్యంతరం ఉండదని అన్నారు. అయితే విద్య, వైద్యం, రైతులకు సబ్సిడీలు ఇవ్వడం మాత్రం న్యాయమేనని మంత్రి నిర్మల వ్యాఖ్యానించారు.

More Telugu News