టీటీడీ ఈవో ధర్మారెడ్డి ఇంట విషాదం.. గుండెపోటుతో కుమారుడి మృతి
- ఆదివారం గుండె పోటుతో చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో
చేరిన చంద్రమౌళి రెడ్డి - పరిస్థితి విషమించడంతో ఈ రోజు ఉదయం కన్నుమూత
- ఇటీవలే చంద్రమౌళికి నిశ్చితార్థం
ముంబైలో ఉద్యోగం చేస్తూ, సివిల్స్ పరీక్షలకు సన్నద్ధం అవుతున్న చంద్రమౌళికి ఇటీవలే చెన్నై పారిశ్రామికవేత్త, టీటీడీ చెన్నై స్థానిక సలహా మండలి అధ్యక్షుడు ఏజే శేఖర్ రెడ్డి కుమార్తెతో వివాహం నిశ్చయమయింది. వచ్చే నెలలో వివాహం జరగాల్సి ఉంది. అయితే, వివాహ ఆహ్వాన పత్రికలను బంధువులకు అందజేసేందుకు ఆయన చెన్నై వెళ్లారు.
అక్కడ కారులో ప్రయణిస్తుండగా చంద్రమౌళికి గుండె నొప్పి వచ్చింది. బంధువులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే ఆయనను నగరంలోని కావేరి ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి చేరేలోపే తీవ్ర గుండెపోటుకు గురైనట్లు గుర్తించిన వైద్యులు వెంటిలేటర్పై ఉంచి చికిత్స అందించారు. పరిస్థితి విషమించడంతో ఎక్మో ద్వారా చికిత్సను కొనసాగించారు.
కానీ, వైద్యులు ఎంత ప్రయత్నించినా చంద్రమౌళి ప్రాణాలను కాపాడలేకపోయారు. ఈ ఉదయం 8.20 ఆయన మరణించినట్లు కావేరి ఆసుపత్రి యాజమాన్యం ప్రకటించింది. చంద్రమౌళి ఇదివరకే నేత్ర దానం కోసం నమోదు చేసున్న నేపథ్యంలో ఈ సౌకర్యాన్ని కల్పించినట్టు వెల్లడించింది. ఏదేమైనా మరికొన్ని రోజుల్లో పెళ్లిపీటలు ఎక్కాల్సిన కుమారుడి మరణంతో ఇటు ధర్మారెడ్డి ఇంట, అటు వధువు కుటుంబంలో విషాదం నెలకొంది.