Amaravati: ఢిల్లీలో ధర్నాకు దిగిన అమరావతి రైతులు.. సంఘీభావం ప్రకటించిన పలు పార్టీల నేతలు

  • జంతర్ మంతర్ వద్ద ధర్నా
  • రైతులను కలిసిన గల్లా జయదేవ్, రామ్మోహన్ నాయుడు, రఘురాజు, రామకృష్ణ తదితరులు
  • భారతీయ కిసాన్ సంఘ్ ర్యాలీలో పాల్గొననున్న అమరావతి రైతులు
Amaravati farmers protest in Delhi

ఏపీకి అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలని కోరుతూ ఆ ప్రాంత రైతులు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నాకు దిగారు. అమరావతి ఉద్యమాన్ని ప్రారంభించి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా వారు ధర్నాను చేపట్టారు. రాజధాని రైతుల నిరసనకు టీడీపీ, కాంగ్రెస్, జనసేన, సీపీఐ నేతలు మద్దతు పలికారు. 

టీడీపీ ఎంపీలు గల్లా జయదేవ్, రామ్మోహన్ నాయుడు, వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు, జనసేన నేత హరిప్రసాద్, ఏఐసీసీ కార్యదర్శి జేడీ శీలం, ఏపీ పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా, ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తదితరులు జంతర్ మంతర్ కు వెళ్లి రైతులకు సంఘీభావాన్ని ప్రకటించారు. 

ప్రస్తుతం పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రేపు, ఎల్లుండి వివిధ పార్టీల నేతలను అమరావతి రైతులు కలవనున్నారు. సోమవారంనాడు రామ్ లీలా మైదానంలో జరిగే భారతీయ కిసాన్ సంఘ్ ర్యాలీలో అమరావతి రైతులు పాల్గొననున్నారు. అమరావతి రైతు ఉద్యమాన్ని భారతీయ కిసాన్ సంఘ్ ప్రత్యేక అజెండాగా చేర్చింది.

  • Loading...

More Telugu News