Personal Loan: పర్సనల్ లోన్ ముందుగా తీరిస్తే లాభమా..? నష్టమా..?

  • వ్యక్తిగత రుణాలపై అధిక వడ్డీ రేట్లు
  • రుణం తీసుకున్న తొలినాళ్లలో ముుందుగా చెల్లించేయడం మంచిదే
  • దీనివల్ల దీర్ఘకాలంలో ఎంతో ఆదా చేసుకోవచ్చు
  • 3-5 శాతం వరకు పెనాల్టీ చెల్లించాలి
Pros and Cons of Opting for Personal Loan Prepayments

వడ్డీరేటు అధికంగా పడే రుణాల్లో క్రెడిట్ కార్డు రుణాల తర్వాత వ్యక్తిగత రుణాలే (పర్సనల్ లోన్స్) అని చెప్పుకోవాలి. అందుకే కొందరు పర్సనల్ లోన్ ను ముందుగా తీర్చేద్దామనే ఆలోచన చేస్తుంటారు. ముందుగా తీర్చేయడం వల్ల లాభమా? లేక నష్టమా? అన్న సందేహం వస్తుంటుంది. తీసుకున్న కాల వ్యవధి ఎంత? ఎంత తీర్చారు? ఇంకా ఎంత రుణం మిగిలి ఉంది? ఈ అంశాల ఆధారంగానే ముందస్తు రుణం చెల్లింపు ప్రయోజనమా? కాదా? అన్నది తెలుస్తుంది.

ప్రయోజనాలు
వ్యక్తిగత రుణాన్ని ముందుగా తీర్చి వేయడం వల్ల అధిక వడ్డీ చెల్లింపులను ఆదా చేసుకోవచ్చు. ఉదాహరణకు వ్యక్తిగత రుణాలపై వడ్డీ రేటు 12 శాతం, అంతకంటే ఎక్కువే ప్రస్తుతం అమల్లో ఉంది. ఉదాహరణకు ఒక వ్యక్తి రూ.10 లక్షలను వ్యక్తిగత రుణం కింద ఐదేళ్ల కాలానికి రుణంగా తీసుకున్నారని అనుకుందాం. రుణంపై రేటు 13 శాతం. ఈ లెక్కన ఈఎంఐ రూ.22,753 అవుతుంది. ఏడాది తర్వాత ఏదో రూపంలో నిధులు అందుబాటులోకి వచ్చాయి. అప్పుడు మిగిలిన రుణం మొత్తాన్ని చెల్లించేయడం వల్ల రూ.2.44 లక్షల వరకు వడ్డీని ఆదా చేసుకోవచ్చు. ఆన్ లైన్ లో పర్సనల్ లోన్ ప్రీపేమెంట్ కాలిక్యులేటర్ లు ఉన్నాయి. వాటి సాయంతో నిజంగా లాభమా, నష్టమా తెలుసుకోవచ్చు.

రుణాన్ని ముందుగా తీర్చేస్తే, ప్రతి నెలా పెద్ద మొత్తంలో ఈఎంఐ చెల్లించాల్సిన భారం తొలగిపోతుంది. ఏదైనా కారణంగా సకాలంలో చెల్లించలేకపోతే క్రెడిట్ స్కోర్ పడిపోతుందన్న ఆందోళన ఉండదు. క్రెడిట్ స్కోరుకు సంబంధించి రుణాల సమతుల్యత కూడా ముఖ్యమే. అంటే మొత్తం రుణాల్లో ఎన్ని సెక్యూర్డ్, ఎన్ని అన్ సెక్యూర్డ్ రుణాలున్నాయనేది చూస్తారు. ఈ రెండింటి మధ్య మంచి సమతూకం ఉంటే అధిక క్రెడిట్ స్కోర్ లభిస్తుంది.

ప్రతికూలతలు
వ్యక్తిగత రుణాలను ముందుగా చెల్లించడం వల్ల బ్యాంకులు మిగిలిన కాలంలో కొంత వడ్డీ ఆదాయాన్ని నష్టపోతాయి. అందుకే అవి ప్రీ క్లోజర్  (ప్రీ పేమెంట్) చార్జీలను వసూలు చేస్తాయి. ఫ్లోటింగ్ రేటుపై రుణం తీసుకున్న వారికి  ప్రీక్లోజర్, ప్రీపేమెంట్ చార్జీలను వేయరాదని ఆర్ బీఐ ఆదేశించింది. కానీ, ఫిక్స్ డ్ రేటు రుణాలకు ఈ నిబంధన లేదు. బ్యాంకులు అధికంగా వ్యక్తిగత రుణాలను స్థిర వడ్డీ రేటుపైనే ఇస్తుంటాయి. 

ఈ చార్జీలు బ్యాంకులను బట్టి వేర్వేరుగా ఉండొచ్చు. ఎస్ బీఐ అయితే ప్రీపేమెంట్ అయినా, ప్రీ క్లోజర్ అయినా 3 శాతం వసూలు చేస్తోంది. పీఎన్ బీ ఎలాంటి చార్జీలు వసూలు చేయడం లేదు. ఐసీఐసీఐ బ్యాంకు అయితే వ్యక్తిగత రుణాలను ముందుగా చెల్లిస్తే 5 శాతం చార్జీ, దానిపై జీఎస్టీ అమలు చేస్తోంది. ముందుగా రుణాలను ముగించేసినా (ప్రీ క్లోజర్) 5 శాతం చార్జీ రాబడుతోంది. ఇలా బ్యాంకులను బట్టి రేట్లు, విధానాల్లో మార్పు ఉంటుంది. అందుకని ముందుగా వ్యక్తిగత రుణాన్ని ముగించేయాలని అనుకున్న వారు బ్యాంకును సంప్రదించి ఎంత చార్జీలన్నవి తెలుసుకోవాలి.

వ్యక్తిగత రుణాలను ఎప్పుడూ కూడా తొలి నాళ్లలో తీర్చివేయడం వల్ల లాభమే. ఉదాహరణకు 13 శాతం వడ్డీ రేటుపై రుణం తీసుకున్నారని అనుకుందాం. అప్పుడు 3 శాతం పెనాల్టీ కట్టినా, 10 శాతం ఆదా చేసుకోవచ్చు. అంతేకాదు, అప్పటి వరకు రుణ ఈఎంఐగా కడుతున్న మొత్తాన్ని మంచి మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లో ఇన్వెస్ట్ చేసుకుంటే, సగటున 12 శాతం రాబడి వస్తుంది. అంటే రుణంపై ఆదా అయిన 10 శాతం, దీన్ని పెట్టుబడి పెట్టగా దీర్ఘకాలంలో వచ్చే 12 శాతం రాబడిని కలుపుకుంటే ఏటా 22 శాతం మేర ఆదా అవుతుంది. అయితే, మరో ఏడాదిలో వ్యక్తిగత రుణం ముగుస్తుందన్న సమయంలో ముందుగా చెల్లించడం వల్ల పెద్దగా ఆదా ఉండదు.

More Telugu News