Shraddha: అఫ్తాబ్ తనను నరికి చంపుతాడని 2020లోనే ఫిర్యాదు చేసిన శ్రద్ధ వాకర్

  • చంపేస్తానని అఫ్తాబ్ తనను బెదిరించాడని 2020లో శ్రద్ధ ఫిర్యాదు
  • అదే విధంగా హత్యకు గురైన వైనం
  • ముక్కలుగా నరికి విసిరేసిన అఫ్తాబ్
Shraddha complaint on Aftab in 2020

శ్రద్ధ వాకర్ హత్య కేసులో రోజుకొక విషయం వెలుగు చూస్తోంది. ఆమెను అఫ్తాబ్ హత్య చేసి ముక్కలుగా నరికిన సంగతి తెలిసిందే. ఆమె శరీర భాగాలను ఢిల్లీ సమీపంలోని అటవీ ప్రాంతంలో విసిరేశాడు. మరోవైపు, తనకు ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందని శ్రద్ధ ముందుగానే ఊహించింది. వీరిద్దరూ సహజీవనం చేస్తున్న సమయంలో రెండేళ్ల క్రితమే ఇద్దరి మధ్య గొడవ జరిగింది. అప్పుడు ఆమెను అఫ్తాబ్ కొట్టాడు. ఆమెకు ఊపిరాడకుండా చేసి, హత్య చేయాలనుకున్నాడు. ఈ విషయాన్ని అప్పట్లో ఆమె మహారాష్ట్రలోని వసాయ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. 

తనను చంపి, ముక్కలు చేస్తానని... ఆ ముక్కలను విసిరేస్తానని అఫ్తాబ్ బెదిరించాడని ఫిర్యాదులో ఆమె పేర్కొంది. ఇది జరిగి ఆరు నెలలు అయిందని... కానీ చంపేస్తానని బెదిరించడంతో ఫిర్యాదు చేసే ధైర్యం చేయలేదని చెప్పింది. 2020లో ఆమె ఈ ఫిర్యాదు చేసింది. అతనితో కలిసి ఉండాలని లేదని కూడా ఆ ఫిర్యాదులో ఆమె పేర్కొంది. అయినప్పటికీ... మళ్లీ అతనితోనే ఆమె ఎందుకు ఉందనేది ప్రశ్నార్థకంగా మారింది. అప్పట్లో ఆమె ఇచ్చిన ఫిర్యాదుపై ఇప్పుడు పోలీసులు ఆరా తీస్తున్నారు. దానిపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.

More Telugu News