Shiv Sena: కాంగ్రెస్-శివసేన బంధంపై స్పష్టతనిచ్చిన సంజయ్ రౌత్

  • వీర్ సావర్కర్‌పై రాహుల్ వ్యాఖ్యలను ఖండించిన శివసేన
  • కాంగ్రెస్‌తో అన్ని విషయాల్లోనూ రాజీపడబోమన్న సంజయ్ రౌత్
  • దేశానికి అవసరం అనుకుంటే కాంగ్రెస్‌తో పొత్తు కొనసాగుతుందని స్పష్టీకరణ
Sanjay Raut Says Alliance will continue with Congress

వీర్ సావర్కర్‌పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో మహారాష్ట్రలోని మహా వికాశ్ అఘాడీ (ఎంవీఏ)లో లుకలుకలు ఏర్పడ్డాయని, కూటమి నుంచి ఉద్ధవ్ థాకరే శివసేన తప్పుకోబోతోందని వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై ఆ పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ స్పష్టత నిచ్చారు. సావర్కర్‌పై రాహుల్ వ్యాఖ్యలను ఖండించిన ఆయన.. కాంగ్రెస్‌తో అన్ని విషయాల్లోనూ రాజీ పడబోమని తేల్చి చెప్పారు. ముఖ్యంగా సావర్కర్, హిందుత్వ వంటి విషయాల్లో అస్సలు రాజీ పడబోమన్నారు. ఈ విషయంలో తమ సిద్ధాంతాలు ఎప్పటికీ ఒకేలా ఉంటాయన్నారు. 

భారతీయ జనతా పార్టీ (బీజేపీ)తో తమకు చాలా విషయాల్లో విభేదాలు ఉన్నప్పటికీ సుదీర్ఘకాలం పొత్తు పెట్టుకున్నట్టు ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇప్పుడు తాము బీజేపీని వీడాం కానీ సిద్ధాంతాలను కాదని స్పష్టం చేశారు. విభేదాలు ఉన్నప్పటికీ దేశ ప్రయోజనాల కోసం కొన్ని బంధాలను కొనసాగించాల్సి ఉంటుందన్నారు. దేశానికి అవసరం అనుకుంటే కాంగ్రెస్ పార్టీతో పొత్తు కొనసాగుతుందని స్పష్టం చేశారు.

ప్రజాస్వామ్యం, ప్రజల స్వేచ్ఛ, రాజ్యాంగాన్ని రక్షించడం కోసం విభేదాలను పక్కనపెట్టి కాంగ్రెస్‌తో చేతులు కలిపినట్టు వివరించారు. కాగా, భారత్ జోడో యాత్రలో ఉన్న రాహుల్ గాంధీ నిన్న సంజయ్ రౌత్‌కు ఫోన్ చేసి ఆయన ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు.

More Telugu News