krishna: కృష్ణ కడచూపు కోసం అభిమానుల ఆరాటం.. పద్మాలయ స్టూడియో దగ్గర తోపులాట

  • ప్రముఖుల కోసం అభిమానుల క్యూలైన్ ఆపేసిన వైనం
  • ఆగ్రహించిన అభిమానులు.. స్టూడియో లోపలికి దూసుకెళ్లేందుకు ప్రయత్నం
  • సూపర్ స్టార్ పార్థివదేహానికి సంప్రదాయం ప్రకారం పూజలు
scuffle at padmalaya studio

అభిమాన నటుడి హఠాన్మరణంతో బరువెక్కిన గుండెలు.. కడచూపు దక్కదేమోననే ఆందోళన.. వెరసి పద్మాలయ స్టూడియో దగ్గర తోపులాట జరిగింది. సూపర్ స్టార్ కృష్ణను చివరిసారిగా చూసేందుకు ఆయన అభిమానులు వెల్లువెత్తారు. కృష్ణ పార్థివదేహం ఉంచిన పద్మాలయ స్టూడియోకు జనం పోటెత్తారు. భారీ సంఖ్యలో జనం రావడంతో స్టూడియో చుట్టుపక్కల ప్రాంతం మొత్తం జనసంద్రంగా మారింది.

కృష్ణ పార్థివదేహానికి నివాళులు అర్పించేందుకు పెద్ద సంఖ్యలో ప్రముఖులు స్టూడియోకు చేరుకుంటున్నారు. రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు,సెలబ్రిటీలు కృష్ణను చివరిసారి చూసివెళుతున్నారు. ఈ క్రమంలో వీఐపీల కోసం అభిమానుల క్యూలైన్ ను స్టూడియో నిర్వాహకులు తరచుగా ఆపేస్తున్నారు. గవర్నర్ తమిళిసై, మంత్రి తలసాని తదితర ప్రముఖుల కోసం అరగంట పాటు అభిమానులను ఆపేశారు.

మధ్యాహ్నమే అంతిమయాత్ర మొదలు పెడతారని చెబుతుండడంతో తమ హీరో కడచూపు కూడా దక్కదేమోనని అభిమానుల్లో ఆందోళన వ్యక్తమైంది. దీంతో స్టూడియో నిర్వాహకుల విజ్ఞప్తులను లెక్కచేయకుండా అభిమానులు స్టూడియో లోపలికి  దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో అక్కడ తోపులాట జరిగింది. కాసేపు గందరగోళ పరిస్థితి నెలకొంది. ఆ తర్వాత పరిస్థితి నియంత్రణలోకి వచ్చిందని పోలీసులు తెలిపారు. కాగా, పద్మాలయ స్టూడియోలో కృష్ణ పార్థివదేహానికి హిందూ సాంప్రదాయం ప్రకారం పురోహితులు పూజలు నిర్వహించారు.

More Telugu News