Andhra Pradesh: ఫోన్ ట్యాపింగ్ పై ఏపీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసిన లోక్ సభ సెక్రటేరియట్

  • ఫోన్ ట్యాపింగ్ పై లోక్ సభ స్పీకర్ కు ఫిర్యాదు చేసిన ఎంపీ రఘురామరాజు
  • ఏపీ సీఎస్, డీజీపీలకు నోటీసులు జారీ చేసిన లోక్ సభ సెక్రటేరియట్
  • 15 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశం
lok sabha secretatiat issues notices to ap government over mp raghurama krishna rahu complaint

ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై లోక్ సభ సెక్రటేరియట్ ఏపీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. తన ఫోన్ ను ఏపీ అధికారులు ట్యాపింగ్ చేస్తున్నారంటూ వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు ఈ నెల 8న లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై తగిన చర్యలు తీసుకోవాలంటూ ఓం బిర్లా లోక్ సభ సెక్రటేరియట్ కు ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఎంపీ ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై నివేదిక అందజేయాలంటూ లోక్ సభ సెక్రటేరియట్ మంగళవారం ఏపీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.

తన ఫోన్ ను ట్యాపింగ్ చేయడం ద్వారా తన వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగిస్తున్నారని స్పీకర్ కు చేసిన ఫిర్యాదులో రఘురామరాజు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఫిర్యాదుపై వివరణ ఇవ్వాలంటూ ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు ఏపీ డీజీపీకి లోక్ సభ సెక్రటేరియట్ నోటీసులు జారీ చేసింది. 15 రోజుల్లోగా ఈ లేఖపై వివరణ ఇవ్వాలని కూడా లోక్ సభ కార్యాలయం ఏపీ ప్రభుత్వాన్ని కోరింది. అంతేకాకుండా ఈ వివరణను ఫిర్యాదుదారుకు ఇస్తారో, లేదో కూడా వెల్లడించాలని కూడా తన నోటీసుల్లో లోక్ సభ సెక్రటేరియట్ ఏపీ ప్రభుత్వాన్ని కోరింది.

More Telugu News