Rajamouli: ఆర్ఆర్ఆర్ సీక్వెల్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన రాజమౌళి

  • రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, చరణ్ హీరోలుగా ఆర్ఆర్ఆర్
  • గత మార్చిలో విడుదల
  • బాక్సాఫీసు వద్ద ప్రభంజనం
  • అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్స్ లోనూ ప్రదర్శన
  • ఆర్ఆర్ఆర్-2పై తండ్రితో చర్చించానన్న రాజమౌళి
Rajamouli comments on RRR sequel

ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా వచ్చిన ఆర్ఆర్ఆర్ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. నిర్మాణ విలువలు, విజువల్స్, నటీనటుల ప్రతిభ... ఇలా అనేక అంశాల్లో ఆర్ఆర్ఆర్ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. 

గత మార్చిలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద ప్రభంజనం సృష్టించింది. కరోనా వ్యాప్తి కారణంగా ఇళ్లకే పరిమితమైన సినీ అభిమానులను మళ్లీ థియేటర్ల బాట పట్టించిన ఘనత ఆర్ఆర్ఆర్ కు కూడా దక్కుతుంది. 

కాగా, గతంలో బాహుబలి చిత్రాన్ని రెండు భాగాలుగా తీసుకువచ్చిన రాజమౌళి ఇప్పుడు ఆర్ఆర్ఆర్ విషయంలో ఏంచేయనున్నారన్నది చర్చనీయాంశంగా ఉంది. ఈ నేపథ్యంలో రాజమౌళి చేసిన వ్యాఖ్యలు ఆసక్తి కలిగిస్తున్నాయి. 

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, "నా చిత్రాలన్నింటికీ మా నాన్నే కథలు సమకూర్చుతారు. ఆర్ఆర్ఆర్-2 గురించి ఇటీవల కొద్దిగా చర్చించాం. ఇప్పుడాయన ఆ స్టోరీపై కసరత్తులు చేస్తున్నారు" అని వివరించారు. 

ఆర్ఆర్ఆర్ సీక్వెల్ పై రాజమౌళి గతంలోనూ సానుకూలంగా స్పందించారు. "ఒకవేళ సీక్వెల్ సాధ్యమైతే ఎంతో సంతోషిస్తాను. బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుందని కాదు... నా సోదరులు (ఎన్టీఆర్, రామ్ చరణ్)లతో ఎక్కువ సమయం గడిపేందుకు అవకాశం ఉంటుంది. ఇదే నన్ను మరింత ఉత్సాహపరిచే అంశం. అయితే ఈ ప్రాజెక్టును కాలమే నిర్ణయించాలి" అని జక్కన్న పేర్కొన్నారు.

More Telugu News