సూర్యాపేట జిల్లాలో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురి దుర్మరణం

  • మునగాల శివారులో ఘటన
  • అయ్యప్ప స్వామి పడిపూజకు హాజరై వస్తుండగా ఘటన
  • రాంగ్ రూట్‌లో ప్రయాణించిన ట్రాక్టర్
  • బాధితుల్లో మరికొందరి పరిస్థితి విషమం
సూర్యాపేట జిల్లాలో గత అర్ధరాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. మునగాల శివారులోని పెట్రోలు పంపు వద్ద గత అర్ధరాత్రి 12 గంటల సమయంలో జరిగిందీ ఘటన. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సాగర్ ఎడమ కాల్వ గట్టుపై ఉన్న అయ్యప్ప స్వామి ఆలయంలో గత రాత్రి మహాపడిపూజ నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో పాల్గొనేందుకు మునగాల వాసులు కొందరు వెళ్లారు. 

పూజ అనంతరం ట్రాక్టర్ ట్రాలీలో 38 మంది తిరిగి మునగాల బయలుదేరారు. వీరి ట్రాక్టర్ విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై రాంగ్ రూట్‌లో వెళ్తుండగా, మునగాల శివారులోని పెట్రోలు బంకు వద్ద విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను కోదాడ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో మరికొందరి పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని ఖమ్మం, సూర్యాపేట ఆసుపత్రికి తరలించారు.

Suryapet District
Munagala
Road Accident

More Telugu News