ఎమ్మెల్యేగా ప్రమాణం చేసిన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి... హాజరైన టీఆర్ఎస్ అగ్ర నేతలు

  • ఇటీవలే మునుగోడు ఉప ఎన్నికలో గెలిచిన ప్రభాకర్ రెడ్డి
  • ప్రభాకర్ రెడ్డితో ప్రమాణం చేయించిన పోచారం శ్రీనివాసరెడ్డి
  • హాజరైన కేటీఆర్, హరీశ్ రావు, మహమూద్ అలీ, జగదీశ్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి
ఇటీవలే ముగిసిన మునుగోడు ఉప ఎన్నికలో విజయం సాధించిన టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి... గురువారం మధ్యాహ్నం ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. తెలంగాణ అసెంబ్లీలో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఆయన చేత ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మంత్రి కేటీఆర్ తో పాటు మంత్రులు తన్నీరు హరీశ్ రావు, జగదీశ్ రెడ్డి, మహమూద్ అలీ, ప్రశాంత్ రెడ్డి, ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి 2014లో మునుగోడు నుంచే ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే 2018 ఎన్నికల్లో మునుగోడు నుంచే టీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రభాకర్ రెడ్డికే అవకాశం దక్కినా... కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేతిలో ఆయనకు పరాజయం ఎదురైంది. తాజాగా జరిగిన ఉప ఎన్నికల్లో తనను ఓడించిన రాజగోపాల్ రెడ్డినే ప్రభాకర్ రెడ్డి ఓడించారు 


More Telugu News

TRS Telangana TS Assembly Pocharam Srinivas Kusukuntla Prabhakar Reddy KTR Harish Rao Munugode