30 ఏళ్లుగా గ్రానైట్ వ్యాపారం చేస్తున్నా... ఎప్పుడూ నిబంధనలు ఉల్లంఘించలేదు: మంత్రి గంగుల

  • గంగుల ఇంటిలో ముగిసిన ఐటీ, ఈడీ సోదాలు
  • దుబాయి నుంచి కరీంనగర్ చేరిన గంగుల
  • దర్యాప్తు సంస్థలకు సహకరించేందుకే దుబాయి నుంచి వచ్చానని వెల్లడి
గ్రానైట్ ఎగుమతుల్లో అక్రమాలంటూ ఆదాయపన్ను, ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో బుధవారం సోదాలు జరుపుతున్న సంగతి తెలిసిందే. ఈ సోదాల్లో భాగంగా తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ ఇల్లు, కార్యాలయాలపై అధికారులు సోదాలు జరిపారు. బుధవారం ఉదయం నుంచి మొదలైన ఈ సోదాలు రాత్రి దాకా కొనసాగాయి. సోదాల సందర్భంగా గంగుల ఇంటి నుంచి పలు పత్రాలను అధికారులు సీజ్ చేసినట్లు సమాచారం.

ఇదిలా ఉంటే...ఇటీవలే కుటుంబంతో కలిసి దుబాయి పర్యటనకు వెళ్లిన మంత్రి గంగుల కమలాకర్... తన ఇంటిపై ఐటీ, ఈడీ అధికారులు దాడులు చేసిన విషయాన్ని తెలుసుకున్న వెంటనే ఆయన తిరుగు ప్రయాణమయ్యారు. రాత్రికి కరీంనగర్ చేరిన ఆయన ఐటీ, ఈడీ అధికారుల దాడులపై స్పందించారు. గడచిన 30 ఏళ్లుగా తాను గ్రానైట్ వ్యాపారం చేస్తున్నానని తెలిపారు. అయితే ఏనాడూ తాను నిబంధనలు ఉల్లంఘించలేదని పేర్కొన్నారు. తనపైనా, తన వ్యాపారాల పైనా చాలా మంది ఐటీ, ఈడీ అధికారులకు ఫిర్యాదు చేశారన్నారు. దర్యాప్తు సంస్థలకు సహకరించేందుకే తాను దుబాయి నుంచి తిరిగి వచ్చానని తెలిపారు. ప్రజల దృష్టి మళ్లించేందుకే ఐటీ, ఈడీ దాడులు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు.

Telangana
TRS
Gangula Kamalakar
IT Raids
Enforcement Directorate
Karimnagar
Granite

More Telugu News