Telangana: కమ్యూనిస్టుల ప్రచారంతోనే మునుగోడులో టీఆర్ఎస్ కు గెలుపు: మంత్రి జగదీశ్ రెడ్డి

  • మునుగోడులో వామపక్షాలతో కలిసి పోటీ చేసిన టీఆర్ఎస్
  • కూసుకుంట్లను వెంటేసుకుని వామపక్ష పార్టీల కార్యాలయాలకు వెళ్లిన జగదీశ్ రెడ్డి
  • భవిష్యత్తులోనూ వామపక్షాలతో కలిసి సాగనున్నట్లు వెల్లడి
ts minister thanked cpi leaders over trs victory in munugode

హోరాహోరీగా సాగిన మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఎన్నికల్లో సీపీఐ, సీపీఎం పార్టీలతో కలిసి పోటీ చేసిన టీఆర్ఎస్ విజయబావుటా ఎగురవేసింది. ఈ క్రమంలో మంగళవారం హైదరాబాద్ లోని సీపీఐ, సీపీఎం పార్టీల కార్యాలయాలకు వచ్చిన జగదీశ్ రెడ్డి... ఆ పార్టీ నేతలు కూనంనేని సాంబశివరావు, చాడా వెంకట్ రెడ్డి, తమ్మినేని వీరభద్రం, జూలకంటి రంగారెడ్డిలతో భేటీ అయ్యారు. టీఆర్ఎస్ గెలుపునకు కృషి చేసినందుకు కమ్యూనిస్టు పార్టీల నేతలకు వారు ధన్యవాదాలు తెలిపారు.

ఈ సందర్భంగా మాట్లాడిన జగదీశ్ రెడ్డి... మునుగోడు ఎన్నికల్లో కమ్యూనిస్టుల ప్రచారంతోనే టీఆర్ఎస్ విజయం సాధించిందని చెప్పారు. భవిష్యత్తులోనూ కమ్యూనిస్టులతో కలిసే ముందుకు సాగాలని నిర్ణయించుకున్నామన్నారు. ఈ ప్రతిపాదనకు సీపీఐ, సీపీఎం నేతలు కూడా సానుకూలంగా స్పందించారని ఆయన చెప్పారు. మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీని ఓడించడం ద్వారా తెలంగాణను పెద్ద విపత్తు నుంచి కాపాడామనే సంతోషం తమకూ ఉందని ఈ సందర్భంగా కూనంనేని తెలిపారు.

More Telugu News