కేసీఆర్ ను కలిసిన ప్రభాకర్ రెడ్డి... మునుగోడు నూతన ఎమ్మెల్యేను అభినందించిన టీఆర్ఎస్ అధినేత

  • మునుగోడు ఉప ఎన్నికలో గెలిచిన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
  • పార్టీ నేతలతో కలిసి ప్రగతి భవన్ కు వచ్చిన ఎమ్మెల్యే
  • ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా చర్యలు చేపట్టాలన్న కేసీఆర్
హోరాహోరీగా సాగిన మునుగోడు ఉప ఎన్నికలో విజయం సాధించిన టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి... సోమవారం ఆ పార్టీ అధినేత కేసీఆర్ ను కలిశారు. తన అనుచరులు, ఎన్నికల్లో పనిచేసిన నేతలతో కలిసి హైదరాబాద్ లోని ప్రగతి భవన్ కు వచ్చిన ప్రభాకర్ రెడ్డి కేసీఆర్ ను కలిశారు. ఈ సందర్భంగా ప్రభాకర్ రెడ్డిని అభినందించిన కేసీఆర్... నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి సారించాలని సూచించారు. 

ఈ సందర్భంగా మునుగోడు ఉప ఎన్నికలో పార్టీ అభ్యర్థిగా తనకు అవకాశం కల్పించిన కేసీఆర్ కు ప్రభాకర్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. అనంతరం మునుగోడు ఉప ఎన్నికలో పార్టీ గెలుపు కోసం కష్టపడిన పార్టీ నేతలను కేసీఆర్ అభినందించారు. పార్టీ మీద, పార్టీ నాయకత్వం మీద విశ్వాసంతో మునుగోడు ప్రజలు ప్రభాకర్ రెడ్డిని గెలిపించారని కేసీఆర్ అన్నారు. ఈ క్రమంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా కార్యాచరణ ప్రారంభించాలని సూచించారు. ఆయా మంత్రిత్వ శాఖలతో సమన్వయం చేసుకుంటూ మునుగోడు అభివృద్ధికి కష్టపడాలని మంత్రి జగదీశ్ రెడ్డికి కేసీఆర్ సూచించారు.


More Telugu News

Telangana KCR Munugode Kusukuntla Prabhakar Reddy G Jagadish Reddy