Andhra Pradesh: గులకరాయితో చంద్రబాబుపై హత్యాయత్నం జరిగిందట: కొడాలి నాని

టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు రోడ్ షోపై నందిగామలో జరిగిన దాడి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇంటి వద్ద రెక్కీ జరిగిందంటూ వచ్చిన వార్తలపై వైసీపీ నేత, కృష్ణా జిల్లా గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని విమర్శలు గుప్పించారు. చంద్రబాబు, పవన్ లు రాష్ట్రంలో లేని కొత్త సమస్యలను సృష్టిస్తున్నారని ఆయన ఆరోపించారు. చంద్రబాబు, పవన్ లు పొలిటికల్ టూరిస్టులు అని ఆయన ఆరోపించారు. ఈ సందర్భంగా పవన్ ఇంటి వద్ద రెక్కీ జరిగిన ఘటనను ప్రస్తావించిన నాని... తాగుబోతులు గొడవ చేస్తే పవన్ ఇంటిపై రెక్కీ జరిగిందంటూ జనసేన ఆరోపిస్తోందని ఆయన సెటైర్లు సంధించారు. 

చంద్రబాబు రోడ్ షోపై జరిగిన దాడిని ప్రస్తావించిన నాని... గులకరాయితో చంద్రబాబుపై హత్యాయత్నం జరిగిందట అని వ్యంగ్యం ప్రదర్శించారు. చంద్రబాబు తనపై తానే గులకరాయి వేయించుకున్నారని కూడా ఆయన ఆరోపించారు. టీడీపీ, జనసేనలు డ్రామాలు చేస్తున్నాయన్నారు. కేఏ పాల్ కన్నా వెనకబడిపోయానని పవన్ ఇప్పటం గ్రామానికి వచ్చారన్నారు. అంతేకాకుండా కేఏ పాల్ ను మించి హడావిడి చేసేందుకు ఇప్పటంలో పవన్ ప్రయత్నించారన్నారు. విపక్షాలు ఇప్పటిదాకా ఒక్క నిర్మాణాత్మకమైన సలహా అయినా ఇచ్చాయా? అని ఆయన ప్రశ్నించారు.
Andhra Pradesh
YSRCP
Kodali Nani
Pawan Kalyan
Janasena
TDP
Chandrababu

More Telugu News