Balakrishna: బాలయ్యతో పరశురామ్ కాంబో సెట్ కావడం ఖాయమే!

  • బాలయ్య కోసం కథ రెడీ చేశానన్న పరశురామ్ 
  • గీతా ఆర్ట్స్ లో చేసే అవకాశం 
  • ప్రస్తుతం 'వీరసింహా రెడ్డి' చేస్తున్న బాలయ్య 
  • తదుపరి సినిమా అనిల్ రావిపూడితో
Balakrishna in parashuram Movie

ఈ మధ్య కాలంలో ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కొత్త ప్రాజెక్టుల శ్రీకారానికి కూడా వేదికలుగా మారుతున్నాయి. కొన్ని కాంబినేషన్స్ ఈ వేదికలపైనే సెట్టయిపోతున్నాయి. మొన్నటికి మొన్న ఒక ప్రీ రిలీజ్ ఈవెంటులో నాని మాట్లాడుతూ .. మారుతితోను .. మేర్లపాక గాంధీతోను .. 'శ్యామ్ సింగరాయ్' నిర్మాత వెంకట్ బోయనపల్లితోను సినిమాలు చేయాలని ఉందంటూ, ఒకే వేదికపై ముగ్గురును లైన్లో పెట్టేశాడు. ఇక వాళ్లు అదే పనిలో ఉంటారని ప్రత్యేకంగా చెప్పవలసిన పనిలేదు. 

తాజాగా నిన్న రాత్రి జరిగిన 'ఊర్వశివో రాక్షసివో' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంటుకు బాలకృష్ణ ముఖ్య అతిథిగా వచ్చారు. గీతా ఆర్ట్స్ లో 'శ్రీరస్తు శుభమస్తు' .. 'గీత గోవిందం' వంటి హిట్స్ చేసిన కారణంగా, ఆ సంస్థతో ఉన్న అనుబంధం కారణంగా పరశురామ్ కూడా ఈ ఫంక్షన్ కి వచ్చాడు. ఒక అద్భుతమైన కథతో త్వరలోనే బాలయ్యను కలవబోతున్నాననీ, ఆ విషయం అల్లు అరవింద్ గారికి కూడా తెలుసునని ఈ స్టేజ్ పై పరశురామ్ అన్నాడు. 

గీతా ఆర్ట్స్ తో పరశురామ్ కి చాలా సాన్నిహిత్యం ఉంది. ఇక బాలయ్యతో గీతా ఆర్ట్స్ వారికి మంచి అనుబంధం ఉంది. అందువలన ఈ ప్రాజెక్టు సెట్ కావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇక ఈ సినిమా గీతా ఆర్ట్స్ లో ఉండే అవకాశాలు కూడా ఎక్కువే. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో 'వీరసింహా రెడ్డి' సినిమా చేస్తున్న బాలకృష్ణ, ఆ తరువాత సినిమాను అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేయనున్నారు.

More Telugu News