Bombay High Court: పెళ్లయిన మహిళతో ఇంటి పనులు చేయిస్తే క్రూరత్వం ఎలా అవుతుంది?: బాంబే హైకోర్టు

  • విడిపోయిన భర్త, అతడి తల్లిదండ్రులపై పెట్టిన గృహహింస కేసును కొట్టేసిన కోర్టు
  • ఇంటి పనులు చేయడమంటే అది కుటుంబం కోసమే అవుతుందన్న న్యాయస్థానం
  • పనిమనిషి చేసే పనితో పోల్చకూడదని స్పష్టీకరణ
Married woman asked to do household work for family not cruelty says Bomby High Court

ఇంటి పనులు చేయమని పెళ్లయిన మహిళకు చెప్పడం క్రూరత్వం కిందకు రాదని బాంబే హైకోర్టుకు చెందిన ఔరంగాబాద్ బెంచ్ తేల్చి చెప్పింది. ఇంటి పనులు చేయమని చెప్పినంతనే పనిమనిషితో పోల్చడం సరికాదని చెబుతూ విడిపోయిన భర్త, అతడి తల్లిదండ్రులపై పెట్టిన గృహహింస కేసును కోర్టు కొట్టివేసింది. 

కేసు పూర్వాపరాల్లోకి వెళ్తే.. పెళ్లయిన నెల రోజుల తర్వాత భర్త తనను పనిమనిషిలా చూడడం ప్రారంభించాడని, కారు కొనుక్కునేందుకు రూ. 4 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేయడంతోపాటు మానసికంగా, భౌతికంగా ఎంతో వేధించాడని బాధిత మహిళ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.


ఈ కేసును తాజాగా విచారించిన న్యాయస్థానం.. పెళ్లయిన మహిళను ఇంటి పనులు చేయమని అడగడం అంటే అది కచ్చితంగా కుటుంబం కోసమే అవుతుందని, దానిని పనిమనిషి చేసే పనితో పోల్చడం సరికాదని పేర్కొంది. ఇంటి పనులు చేయడం ఆమెకు ఇష్టం లేకుంటే ఆ విషయాన్ని పెళ్లికి ముందే చెప్పి ఉండాల్సిందని ధర్మాసనం అభిప్రాయపడింది. తనను మానసికంగా, భౌతికంగా వేధించారని ఫిర్యాదుదారు ఆరోపించినప్పటికీ అందుకు తగిన ఆధారాలను చూపించలేకపోయారని పేర్కొన్న న్యాయస్థానం.. సెక్షన్ 498ఎ ఈ కేసుకు వర్తించదని స్పష్టం చేస్తూ భర్త, అతడి తల్లిదండ్రులపై పెట్టిన గృహహింస కేసును కొట్టివేస్తూ తీర్పు చెప్పింది.

More Telugu News