Mainpuri: టీ పొడి అనుకుని పిచికారీ మందుతో టీ తయారు చేసిన ఇల్లాలు.. ఐదుగురి మృతి

  • ఉత్తరప్రదేశ్‌లోని మెయిన్‌పురిలో ఘటన
  • వరిపంటలో పిచికారీ చేసే మందును టీపొడిగా భావించిన మహిళ
  • భర్త, ఇద్దరు కుమారులు, మామ, పొరిగింటి వ్యక్తి మృతి
Five persons including two children died after consuming tea in their house

ఓ ఇల్లాలు చేసిన టీ తాగి ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఉత్తరప్రదేశ్‌లోని మెయిన్‌పురిలోని నాగ్లా కన్హై లో జరిగిందీ విషాద ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన శివానందన్ భార్య రోజులానే టీ పెట్టి ఇంట్లో వారికి ఇచ్చింది. అది తాగిన శివానందన్ (35), అతడి కుమారులు శివంగ్ (6), దివ్యాన్ష్ (5), మామ రవీంద్రసింగ్ (55), పొరుగింటి వ్యక్తి సోబ్రాన్ (45) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే వారిని జిల్లా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే రవీంద్ర సింగ్, శివంగ్, దివ్యాన్ష్‌లు మృతి చెందారు. 

సోబ్రాన్, శివానంద్‌ల ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని అక్కడి నుంచి సైఫాయి ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ వారిద్దరూ ప్రాణాలు కోల్పోయారు. శివానంద్ భార్య టీ కాస్తున్న సమయంలో వరిపంటలో పిచికారీ చేసే మందును టీపొడిగా భావించి పాలలో కలిపి టీ తయారు చేసినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. పాలలో కలిపిన పిచికారీ మందు విషపూరితం కావడంతో అది తాగిన వారు మరణించినట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News