Telangana: కేసీఆర్ తో పెట్టుకుంటే కొరివితో తల గోక్కున్నట్లే: బీజేపీని హెచ్చరించిన బాల్క సుమన్

  • టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టే యత్నం చేసిన ముఠా అరెస్ట్
  • రాజగోపాల్ రెడ్డి లాంటి వాళ్లను కొనొచ్చేమోనన్న బాల్క సుమన్
  • టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనలేరని వెల్లడి
  • ప్రలోభాలతో చిల్లర వేషాలు వేస్తున్నారని మండిపాటు
  • మమ్మల్ని ఆగం చేయబోయి బీజేపీ ఆగమైందన్న చెన్నూరు ఎమ్మెల్యే
trs mla balka suman fires on operation akarsh gang

తెలంగాణలో అధికార పార్టీ ఎమ్మెల్యేలను పార్టీ ఫిరాయించేలా మంతనాలు సాగిస్తూ పోలీసులకు అడ్డంగా దొరికిపోయిన ముఠా వ్యవహారంపై ఆ పార్టీ యువ నేత, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ ఘాటుగా స్పందించారు. హైదరాబాద్ శివారులోని మొయినాబాద్ ఫామ్ హౌజ్ పై సైబరాబాద్ పోలీసులు దాడి చేసి ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసిన వ్యవహారంపై బుధవారం రాత్రి సుమన్ స్పందించారు.

సీఎం కేసీఆర్ తో పెట్టుకుంటే కొరివితో తల గోక్కున్నట్టేనని బీజేపీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. మునుగోడు ఎన్నికలో గెలిచేందుకు బీజేపీ నేతలు దొడ్డి దారి పట్టారని ఆయన ఆక్షేపించారు.

అంగట్లో సరుకులా రాజగోపాల్ రెడ్డి లాంటి వారిని బీజేపీ నేతలు కొనొచ్చేమో గానీ... టీఆర్ఎస్ నేతలను కొనలేరని సుమన్ అన్నారు. టీఆర్ఎస్ నేతలే కేంద్రం కుట్రలను బయటపెట్టారని ఆయన అన్నారు. రూ.100 కోట్లకు పైగా డబ్బుతో పాటు కాంట్రాక్టులు ఇస్తామని ఆశ చూపుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. 

దొడ్డిదారిలో అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ నేతలు యత్నిస్తున్నారని విమర్శించారు. ప్రలోభాలతో చిల్లర వేషాలు వేస్తున్నారని మండిపడ్డారు. టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను ఆగం చేయాలని యత్నించిన బీజేపీ నేతలే ఆగమయ్యారని సుమన్ అన్నారు. చండూరులో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 

More Telugu News