OMC Case: ఓఎంసీ కేసులో కీలక పరిణామం... డిశ్చార్జీ పిటిషన్లన్నీ కొట్టివేత

  • సుప్రీంకోర్టు ఆదేశాలతో ఓఎంసీ కేసు విచారణలో వేగం
  • మంత్రి సబిత, ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మీల డిశ్చార్జీ పిటిషన్లను కొట్టేసిన సీబీఐ కోర్టు
  • కృపానందం, వీడీ రాజగోపాల్, అలీఖాన్ పిటిషన్లూ కొట్టివేత
  • నిందితులపై అభియోగాల నమోదును 21కి వాయిదా వేసిన కోర్టు
cbi court dismisses all discharge petitions in omc case

కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి కీలక నిందితుడిగా నమోదైన ఓబుళాపురం అక్రమ మైనింగ్ కేసులో సోమవారం ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు విచారణ నుంచి తమ పేర్లను తప్పించాలంటూ నిందితులు దాఖలు చేసిన అన్ని డిశ్చార్జీ పిటిషన్లను నాంపల్లిలోని సీబీఐ ప్రత్యేక కోర్టు సోమవారం కొట్టివేసింది. 

ఈ మేరకు ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న తెలంగాణ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి. ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మీ, రిటైర్డ్ అధికారులు కృపానందం, వీడీ రాజగోపాల్, గాలి జనార్దన్ రెడ్డి పీఏ అలీఖాన్ లు దాఖలు చేసుకున్న డిశ్చార్జీ పిటిషన్లను సీబీఐ కోర్టు కొట్టివేసింది. ఈ కేసులో దాఖలు చేసిన డిశ్చార్జీ పిటిషన్ ను గాలి జనార్దన్ రెడ్డి గతంలోనే ఉపసంహరించుకున్నారు.

ఇదిలా ఉంటే... మొన్నటిదాకా ఎలాంటి పురోగతి లేని ఓఎంసీ కేసుపై ఇటీవలే సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నాంపల్లిలోని సీబీఐ కోర్టు ఈ కేసు విచారణలో వేగం పెంచింది. నిందితుల డిశ్చార్జీ పిటిషన్లను కొట్టేసిన సీబీఐ కోర్టు...నిందితులపై అభియోగాల నమోదుకు సంబంధించిన విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది.

More Telugu News