వరుసలో నిలుచుని.. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో ఓటేసిన రాహుల్ గాంధీ
- నేటి ఉదయం ప్రారంభమైన కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల పోలింగ్
- సుగినేకళ్ వద్ద జోడో యాత్రికుల కోసం ప్రత్యేక పోలింగ్ కేంద్రం
- అక్కడే ఓటు హక్కు వినియోగించుకున్న రాహుల్ గాంధీ
ఇటీవలే కర్ణాటకలో యాత్రను ముగించుకున్న రాహుల్ గాంధీ ఏపీలోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కర్ణాటక, ఏపీ సరిహద్దులో యాత్ర సాగిస్తున్న రాహుల్ గాంధీ ఆదివారం రాత్రి రెండు రాష్ట్రాల సరిహద్దు గ్రామం సుగినేకళ్ లో బస చేశారు. పార్టీ అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో రాహుల్ తో పాటు యాత్రలో పాలుపంచుకుంటున్న పార్టీ నేతల కోసం సుగినేకళ్ శిబిరంలోనే పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. రాహుల్ యాత్ర వెంట సాగుతున్న ఓ కంటెయినర్ లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రానికి పార్టీ నేతలతో కలిసి ఆయన వెళ్లారు. అక్కడ అందరి మాదిరే వరుసలో నిలుచుని మరీ రాహుల్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.