YSRCP: 3 రాజ‌ధానుల‌కు మ‌ద్ద‌తుగా బైక్ ర్యాలీలో కింద‌ప‌డ్డ వైసీపీ ఎమ్మెల్యే... గాయంతో ఆసుప‌త్రిలో చేరిక‌

  • న‌ర్సీపట్నంలో ఉమాశంక‌ర్ గ‌ణేశ్ ఆధ్వ‌ర్యంలో బైక్ ర్యాలీ
  • ఎమ్మెల్యే బైక్‌ను సైడు నుంచి ఢీ కొట్టిన మ‌రో బైక్‌
  • గ‌ణేశ్ కాలికి తీవ్ర గాయం కావ‌డంతో ఆసుప‌త్రికి త‌ర‌లింపు
  • ఆప‌రేష‌న్ త‌ప్ప‌ద‌ని చెప్పిన వైద్యులు
ysrcp mla uma shankar ganesh fell down in bike rally and hospitalised

ఏపీలో మూడు రాజ‌ధానుల‌కు మ‌ద్ద‌తుగా ఉత్త‌రాంధ్ర‌కు చెందిన వైసీపీ నేత‌లు ప‌లు కార్య‌క్ర‌మాలు చేప‌డుతున్నారు. ఇందులో భాగంగా న‌ర్సీపట్నంలో స్థానిక ఎమ్మెల్యే ఉమాశంక‌ర్ గ‌ణేశ్ నేతృత్వంలో శ‌నివారం భారీ బైక్ ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీలో ఉత్సాహంగా పాలుపంచుకున్న ఉమాశంక‌ర్ గ‌ణేశ్ బైక్ పైనుంచి కింద ప‌డిపోయారు. దీంతో ఆయ‌న కాలికి తీవ్ర గాయ‌మైంది. ఈ ఘ‌ట‌న‌తో న‌ర్సీప‌ట్నం వైసీపీ శ్రేణులు షాక్‌కు గుర‌య్యాయి.

ర్యాలీలో భాగంగా ఉమాశంక‌ర్ గ‌ణేశ్ న‌డుపుతున్న బైక్‌ను మ‌రో బైక్ ఓ సైడు నుంచి ఢీకొట్టింది. దీంతో ఉమాశంక‌ర్ గ‌ణేశ్ అదుపు త‌ప్పి ప‌డ‌పోయారు. ఈ ప్ర‌మాదంలో గ‌ణేశ్ కాలికి గాయం కావ‌డంతో ఆయ‌న అనుచ‌రులు హుటాహుటీన న‌ర్సీప‌ట్నంలోని ఓ ప్రైవేట్ ఆసుప‌త్రికి త‌ర‌లించారు. అక్క‌డ ప్రాథ‌మిక వైద్యం చేయించుకున్న గ‌ణేశ్ మెరుగైన చికిత్స కోసం ప‌ట్ట‌ణంలోని మ‌రో ఆసుప‌త్రికి వెళ్లారు. కాలికి అయిన గాయానికి ఆప‌రేష‌న్ చేస్తే త‌ప్పించి ఫ‌లితం ఉండ‌ద‌ని వైద్యులు చెప్పిన‌ట్లు స‌మాచారం.

More Telugu News