ఐసీఐసీఐ బ్యాంక్ నుంచి రూ. 12 కోట్లు కొల్లగొట్టిన ఘరానా దొంగ అరెస్ట్
- జులై 12న థానేలో భారీ దోపిడీ
- ఇప్పటి వరకు ఈ కేసులో ఐదుగురు అరెస్ట్
- ఇప్పటి వరకు రూ. 9 కోట్లు రికవరీ చేసిన పోలీసులు
అల్తాఫ్ ఐసీఐసీఐ బ్యాంక్ లో కస్టోడియన్ గా పని చేస్తున్నాడు. బ్యాంక్ లాకర్ కీస్ కు ఆయన కేర్ టేకర్ గా ఉన్నాడు. ఈ దోపిడీకి సంబంధించి ఏడాది కాలంగా ఆయన ప్లానింగ్ చేశాడు. ఏసీ డక్ట్ ను కొంచెం వెడల్పు చేశాడు. అందులో డబ్బు పడేస్తే నేరుగా పక్కనున్న చెత్తకుప్ప వద్ద పడేలా ఏర్పాటు చేశారు. దొంగతనం సమయంలో సీసీటీవీని ధ్వంసం చేశాడు. అలారం సిస్టమ్ ను డీయాక్టివేట్ చేశాడు. అనంతరం బ్యాంక్ వాల్ట్ ను ఓపెన్ చేసి... డబ్బును ఏసీ డక్ట్ ద్వారా బయటకు పంపించాడు. ఆ తర్వాత డబ్బు మిస్ అయినట్టు బ్యాంక్ అధికారులు గుర్తించిన తర్వాత ఈ దోపిడీ వెలుగులోకి వచ్చింది.
ఈ విషయం వెలుగులోకి వచ్చిన వెంటనే షేక్ పరారయ్యాడు. ఆ తర్వాత ఎవరూ తనను గుర్తించకుండా బుర్ఖా వేసుకుని తిరగడం ప్రారంభించాడు. ఇదే సమయంలో షేక్ కదలికలు పూర్తిగా తెలిసిన ఆయన సోదరి నీలోఫర్ కొంత డబ్బును తన ఇంటికి తరలించింది. ఈ కేసులో ఆమెను కూడా దోషిగా నిర్ధారించిన పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ దోపిడీ కేసులో మరో ముగ్గురు అబ్రార్ ఖురేషీ (33), అహ్మద్ ఖాన్ (33), అనుజ్ గిరి (30)లను కూడా అదుపులోకి తీసుకున్నారు.