Tollywood: ట్రోలింగ్‌పై సైబ‌ర్ క్రైమ్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశా: హీరో మంచు విష్ణు

  • టాలీవుడ్ హీరో కార్యాల‌యం నుంచే త‌న‌పై ట్రోలింగ్ జ‌రుగుతోంద‌న్న విష్ణు
  • 18 యూట్యూబ్ ఛానెళ్ల‌పై ఫిర్యాదు చేసిన‌ట్లు వెల్ల‌డి
  • గ‌తంలో టాలీవుడ్ అంతా ఓ కుటుంబంలా ఉండేద‌ని వ్యాఖ్య‌
  • త‌న కుటుంబంపై పెయిడ్ క్యాంపెయిన్ చేయిస్తున్నార‌ని ఆవేద‌న‌
manchu vishnu files a complaint with cyber crime over trolling in social media

టాలీవుడ్ హీరో, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేష‌న్ (మా) అధ్య‌క్షుడు మంచు విష్ణు గురువారం సైబ‌ర్ క్రైమ్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. త‌న‌పైనా, త‌న కుటుంబ స‌భ్యుల‌పైనా సోష‌ల్ మీడియా వేదిక‌గా ట్రోలింగ్ జ‌రుగుతోంద‌ని, ఆ ట్రోలింగ్‌కు కార‌ణ‌మైన వారిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆయ‌న సైబ‌ర్ క్రైమ్ పోలీసుల‌ను కోరారు. ఈ మేరకు సైబ‌ర్ క్రైమ్ పోలీసుల‌కు ఫిర్యాదు చేసిన విష‌యాన్ని ఆయ‌నే స్వ‌యంగా వెల్ల‌డించారు. మొత్తం 18 యూట్యూబ్ ఛానెళ్ల‌ను త‌న ఫిర్యాదులో పేర్కొన్న‌ట్లు విష్ణు తెలిపారు. 

టాలీవుడ్‌కు చెందిన ఓ హీరో కార్యాల‌యం నుంచే త‌న‌పై ట్రోలింగ్ జ‌రుగుతోంద‌ని ఆయ‌న ఆరోపించారు. త‌న కుటుంబ స‌భ్యుల‌పై పెయిడ్ క్యాంపెయిన్ చేయిస్తున్నార‌ని ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. గ‌తంలో సినీ ప‌రిశ్ర‌మ అంతా ఓ కుటుంబంలా ఉండేదని ఆయ‌న గుర్తు చేసుకున్నారు. త‌న‌పై ట్రోలింగ్ చేసేందుకు ఏకంగా ఓ వాట్సాప్ గ్రూప్‌నే క్రియేట్ చేశార‌ని ఆయ‌న ఆరోపించారు. సాధార‌ణంగా తాను ట్రోల్స్ ను పెద్ద‌గా పట్టించుకోనన్న విష్ణు... జ‌వాబుదారీత‌నం కోస‌మే కేసులు పెడుతున్నానని వెల్ల‌డించారు. త‌న‌కు ప్ర‌స్తుతానికి సినిమా థియేట‌ర్ల స‌మ‌స్య లేదని, అయితే త‌న‌కు అన్యాయం జ‌రిగితే మాత్రం మాట్లాడ‌టానికి వెనుకాడబోన‌ని వ్యాఖ్యానించారు.

More Telugu News