PFI: పాట్నాలో ప్రధాని మోదీపై దాడి చేయాలనుకున్న పీఎఫ్ఐ

  • ఈ జులై 12న బీహార్ లో మోదీ ర్యాలీపై దాడికి ప్లాన్ చేసినట్టు ఈడీ వెల్లడి
  • ఉగ్రశక్తులతో చేతులు కలిపి యూపీలో అల్లర్లకు కూడా కుట్ర చేసినట్టు గుర్తింపు
  • ఇందుకోసం భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలు సమకూర్చినట్టు విచారణలో వెల్లడి
  • దేశంలో అల్లర్లకు రూ. 120 కోట్లు సమీకరించినట్లు రిపోర్టు 
PFI plotted to attack PM Modi in Bihar on July 12 says ED

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై దాడి చేసేందుకు పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) పథకం రచించిందని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ సంచలన విషయం వెల్లడించింది. ఈ మధ్య పీఎఫ్ఐ కార్యాలయాలు, దాని మద్దతుదారులపై ఎన్ఐఏ, ఈడీ దాడులు చేసి పదుల సంఖ్యలో అరెస్టులు చేశాయి. ఈ క్రమంలో జులై 12 న బీహార్ లో జ‌రిగిన ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ ర్యాలీని ల‌క్ష్యంగా చేసుకొని దాడి చేసేందుకు పీఎఫ్ఐ ప‌థ‌కం ప‌న్నిన‌ట్లు తెలిసింద‌ని ఈడీ వెల్ల‌డించింది. అయితే, పీఎఫ్ఐ ఈ దాడి చేయలేకపోయింది. 

అలాగే, ఉగ్ర శక్తులతో చేతులు కలిపి ఉత్తరప్రదేశ్ లోని సున్నితమైన ప్రాంతాలు, పలువురు వ్యక్తులపై ఏకకాలంలో దాడి చేసేందుకు ఆయుధాలు, పేలుడు పదార్థాలు సమకూర్చుకుందని ఈడీ తెలిపింది. కేర‌ళలో అరెస్ట‌యిన పీఎఫ్ఐ స‌భ్యుడు ష‌ఫీక్ పాయెత్ రిమాండ్ రిపోర్టులో ఈ విషయాలు వెల్లడించింది. జులై 12న ప్ర‌ధాని మోదీ పాట్నాకు వెళ్లే స‌మ‌యంలోనే దాడులు చేసేందుకు తమ సభ్యులకు పీఎఫ్ఐ కోచింగ్ క్యాంపును ఏర్పాటు చేసింద‌ని తెలిపింది. పీఎఫ్ఐ ఎన్నో ఏళ్ల నుంచి కూడ‌బెట్టిన రూ.120 కోట్లను ఈడీ గుర్తించింది.

ఎక్కువగా నగదు రూపంలో ఉన్న ఈ మొత్తాన్ని దేశం అంత‌టా అల్ల‌ర్లు, తీవ్ర‌వాద చ‌ర్య‌లు సృష్టించడానికి వాడేందుకే సేక‌రించిన‌ట్లు తెలుస్తోంద‌ని ఈడీ వెల్ల‌డించింది. ఈడీ నలుగురు పీఎఫ్ఐ స‌భ్యులను అరెస్టు చేసిన తర్వాత ఎన్ఐఏ కూడా రంగంలోకి దిగింది. దేశవ్యాప్తంగా ఆ సంస్థకు చెందిన దాదాపు 100 మందికి పైగా కార్య‌క‌ర్త‌ల‌ను అదుపులోకి తీసుకుంది. దేశంలో అల్ల‌క‌ల్లోలం సృష్టించ‌డానికి విదేశాల నుంచి కూడా పీఎఫ్ఐ నిధులు సమకూర్చుకుంటోందని ఈడీ తెలిపింది. విదేశాల నుంచి వచ్చే న‌గ‌దు మార్చ‌డానికి పలువురు ఎన్ ఆర్ఐ ఖాతాల‌ను నిందితులు చ‌ట్ట‌విరుద్దంగా ఉప‌యోగించుకున్నార‌ని ఈడీ ఆరోపించింది.

More Telugu News