ఢిల్లీ లిక్కర్ స్కాం ఏమిటో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు: సీఎం అరవింద్ కేజ్రీవాల్
- రూ.70 వేల కోట్ల బడ్జెట్ ఉన్నరాష్ట్రంలో రూ.1.5 లక్షల కోట్ల స్కాం సాధ్యమేనా అని ప్రశ్న
- కుంభకోణం జరిగిందని నిరూపించి సిసోడియాను అరెస్ట్ చేయాలని వినతి
- లేదంటే సోమవారం సిసోడియాకు దర్యాప్తు సంస్థలు సారీ చెప్పాలని డిమాండ్
ఈ కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాపై కేసు నమోదు కాగా... ఈ కేసుతో సంబంధం ఉందంటూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శుక్రవారం దేశవ్యాప్తంగా పలుచోట్ల, పలువురు వ్యక్తుల ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు చేస్తోంది. అలాంటి సమయంలో కేజ్రీవాల్ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఢిల్లీలో వెలుగు చూసిందని అందరూ అంటున్న ఈ మద్యం కుంభకోణం ఏమిటో తనకు ఇప్పటికీ పూర్తిగా అర్థం కాలేదని కేజ్రీవాల్ అన్నారు. ఈ కుంభకోణం విలువ రూ.1.5 లక్షల కోట్లు అని ఓ బీజేపీ నేత చెప్పారన్న కేజ్రీవాల్... ఢిల్లీ మొత్తం బడ్జెట్టే రూ.70 వేల కోట్లు అయినప్పుడు రూ.1.5 లక్షల కోట్ల కుంభకోణం జరిగే అవకాశముందా? అని ప్రశ్నించారు.
ఈ కుంభకోణం విలువపై దర్యాప్తు సంస్థలు కూడా తలో మాట చెబుతున్నాయని ఆయన ఆరోపించారు. ఎలాగూ దర్యాప్తు చేస్తున్నారు కాబట్టి సోమవారంలోగా ఈ కుంభకోణం జరిగిందని నిరూపించి మనీశ్ సిసోడియాను అరెస్ట్ చేయాలని, లేదంటే సిసోడియాకు సారీ చెప్పాలని డిమాండ్ చేశారు.