మామూలు యూనియన్ లీడర్ కాదు.. రికార్డు సాధించిన లీడర్.. 61 సార్లు గెలిచిన నేత!
- 1946లో ఈశాన్య రైల్వేలో చేరిన కన్నయ్య లాల్
- అప్పటి నుంచీ కార్మిక సంఘం నేతగా పనిచేస్తూ మంచిపేరు
- తాజాగా 61వ సారి యూనియన్ ప్రధాన కార్యదర్శిగా గెలిచిన వైనం
- యూనియన్ ఆఫీసులోనే ఉంటూ కార్మికులకు అందుబాటులో ఉంటాడనే పేరు
ఆర్మీలో పనిచేసి.. రైల్వేల్లో చేరి..
కన్నయ్య లాల్ గుప్తా మొదట్లో పదేళ్ల పాటు సైన్యంలో పనిచేశారు. సైన్యం నుంచి రిటైరైన తర్వాత 1946లో ఈశాన్య రైల్వేలో చేరారు. అప్పుడే నార్త్ ఈస్టర్న్ రైల్వే మజ్దూర్ యూనియన్ (ఎన్ఈఆర్ఎమ్యూ) సంఘంలో క్రియాశీలకంగా పనిచేయడం మొదలుపెట్టారు. అప్పటి నుంచీ కార్మిక సంఘం నేతగా కొనసాగుతూ వస్తున్నారు. నిజానికి ఆయన 1981లోనే రిటైర్ అయ్యారు. అయినా ఉద్యోగుల విజ్ఞప్తి మేరకు యూనియన్ లో కొనసాగుతున్నారు. ఈ క్రమంలో ఇటీవల జరిగిన యూనియన్ ఎన్నికల్లో 61వ సారి ప్రధాన కార్యదర్శిగా విజయం సాధించారు.
ఇబ్బందులు ఎదురైనా..
యూనియన్ తరఫున పోరాటాల కారణంగా కన్నయ్య తన సర్వీసులో నాలుగు సార్లు డిస్మిస్ అయ్యారట. ఓసారి నెల రోజులు జైలుకు కూడా వెళ్లి వచ్చారని. స్వాతంత్ర్య సమరయోధుడు జయప్రకాశ్ నారాయణ్ స్ఫూర్తితోనే తాను ముందుకు వెళ్తున్నట్టు కన్నయ్య చెబుతున్నారు. ఇన్నేళ్లుగా కలిసి పనిచేయడంతో కార్మిక సంఘం ఆఫీసే ఇల్లుగా, కార్మికులే తన కుటుంబ సభ్యులుగా అయిపోయారని అంటున్నారు. అంతేకాదు రైల్వే యూనియన్ ఆఫీసులోనే ఉంటాడు. అక్కడే తిని, అక్కడే నిద్రపోతాడు. ఆయన కార్యాలయం కార్మికుల కోసం 24 గంటలు తెరిచే ఉంటుందని చెబుతున్నారు.