Krishnam Raju: ప్రేమగా పలకరించే గొంతు మూగబోయింది: కృష్ణంరాజు మృతిపై మోహన్ బాబు

  • రెబల్ స్టార్ కృష్ణంరాజు కన్నుమూత
  • తీవ్ర విషాదంలో టాలీవుడ్ సెలబ్రిటీలు
  • కృష్ణంరాజు తనకు అత్యంత సన్నిహితుడన్న మోహన్ బాబు
  • ఆయన నుంచి చాలా నేర్చుకోవాలని వెల్లడి
Mohan Babu responds to Krishnam Raju demise

తెలుగు చిత్రసీమ నట దిగ్గజం కృష్ణంరాజు మృతి పట్ల సీనియర్ నటుడు మోహన్ బాబు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మోహన్ బాబు ఈ మధ్యాహ్నం హైదరాబాదులో కృష్ణంరాజు భౌతికకాయానికి నివాళులు అర్పించారు. ప్రేమగా పలకరించే గొంతు మూగబోయిందని మోహన్ బాబు ఆవేదనాభరితులయ్యారు. కృష్ణంరాజు తనకు అత్యంత సన్నిహితుడని వెల్లడించారు. ఒక ఆత్మీయుడిని కోల్పోయామని, ఆయన నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉందని పేర్కొన్నారు. 

అటు, అగ్రహీరో అల్లు అర్జున్ స్పందిస్తూ, కృష్ణంరాజు మరణం తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి తీరని లోటు అని తెలిపారు. 50 ఏళ్లుగా ఆయన ఇండస్ట్రీకి ఎన్నో సేవలు అందించారని, సినీ రంగంపై తనదైన ముద్రవేశారని కీర్తించారు. కృష్ణంరాజు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని వెల్లడించారు. 

కాగా, కృష్ణంరాజుకు మెగాస్టార్ చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్, వెంకటేశ్, మురళీమోహన్, జయసుధ, విజయ్ దేవరకొండ తదితరులు నివాళులు అర్పించారు.

More Telugu News