పవన్ కల్యాణ్ కు రూ.25 లక్షల విరాళం అందించిన ఆస్ట్రేలియా జనసేన బృందం

ఏపీలో ఆత్మహత్యలకు పాల్పడిన కౌలు రైతుల కుటుంబాలను ఆదుకునేందుకు జనసేన పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ కౌలు రైతు భరోసా యాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ యాత్రకు ఆస్ట్రేలియాలోని జనసేన మద్దతుదారులు సంఘీభావం ప్రకటించారు. ఈ క్రమంలో జనసేనాని పవన్ కల్యాణ్ కు ఆస్ట్రేలియా ఎన్నారైలు రూ.25 లక్షల విరాళాన్ని అందించారు.

ఆస్ట్రేలియా జనసేన ప్రతినిధులు పప్పుల జ్ఞానేశ్వరరావు, వఝుల పవన్ కిశోర్, పులిపాటి రామ్, గాజుల మురహరి, సింగంశెట్టి పవన్ కుమార్ ఇవాళ పవన్ కల్యాణ్ ను హైదరాబాదులోని పార్టీ ప్రధాన కార్యాలయంలో కలిశారు. ఆయనకు విరాళాల తాలూకు చెక్ ను అందజేశారు. 

ఈ సందర్భంగా పవన్ వారికి కృతజ్ఞతలు తెలిపారు. అన్నం పెట్టే రైతన్నను ఆదుకోవాలన్న సదుద్దేశంతో అందించిన ఈ సాయానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని వెల్లడించారు. ఈ డబ్బును రైతు కుటుంబాలకు చేరేలా, రైతుల పిల్లల చదువులకు ఉపయోగపడేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. కాగా, ఎన్నారైల ఆహ్వానం మేరకు త్వరలోనే తగిన సమయం చూసుకుని ఆస్ట్రేలియాలో పర్యటిస్తానని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.


More Telugu News