APGENCO: ఏపీ జెన్‌కోకు బకాయిలు చెల్లించమనడం కచ్చితంగా దేశద్రోహమే: తెలంగాణ మంత్రి జగదీశ్‌రెడ్డి

  • ఏపీ సంస్థలు తమకు రూ. 12,941 కోట్లు చెల్లించాలన్న మంత్రి
  • మోదీకి ఏపీ రాసిన లేఖలే కనిపిస్తున్నాయని ధ్వజం
  • రైతుల మోటార్లకు మీటర్లు బిగించేది లేదని చెప్పడం వల్లే ఈ ఆదేశాలన్న జగదీశ్‌రెడ్డి
  • కృష్ణా, గోదావరి జలాల విషయంలోనూ తమకు అన్యాయం జరుగుతోందని ఆవేదన
TS Minister jagadish reddy fires on union govt

ఏపీ జెన్‌కోకు బకాయిపడిన సొమ్మును వడ్డీ సహా చెల్లించాలంటూ కేంద్రం ఇచ్చిన ఆదేశాలపై తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి మండిపడ్డారు. తెలంగాణపై కేంద్రం కక్ష కట్టిందని, అందుకే ఇలాంటి ఆదేశాలు జారీ చేసిందని ఆరోపించారు. ఇది ముమ్మాటికి దేశద్రోహ చర్యేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము చెల్లించాలనుకున్న దానికంటే ఏపీ తమకు ఇవ్వాల్సిందే ఎక్కువని అన్నారు. తెలంగాణ విద్యుత్ సంస్థలకు ఏపీ సంస్థలు రూ.12,941 కోట్లు చెల్లించాల్సి ఉందని, ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

తమకు రావాల్సిన బకాయిలు చెల్లించకపోవడమే కాకుండా పీపీఏ అమల్లోనూ ఏపీ తమకు అన్యాయం చేసిందన్నారు. అయినా సరే కేంద్రం జోక్యం చేసుకోలేదని విమర్శించారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టేదే లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ తెగేసి చెప్పడంతోనే కేంద్రం ఈ ఆదేశాలు జారీ చేసిందన్నారు. మోదీకి ఏపీ రాసిన లేఖలు తప్ప తెలంగాణ లేఖలు కనిపించడం లేదని విమర్శించారు. 

నెల రోజుల్లోగా ఏపీకి బకాయిలు చెల్లించాలని ఆదేశించడం దుర్మార్గమని ధ్వజమెత్తారు. విద్యుత్ రంగంలో కేసీఆర్ సాధించిన విజయాలను కేంద్రం జీర్ణించుకోలేకపోతోందన్నారు. సాగుకు 24 గంటలపాటు ఉచిత విద్యుత్ ఇవ్వకుండా అడ్డుకునే కుట్ర ఇందులో కనిపిస్తోందన్నారు. కృష్ణా, గోదావరి జలాల విషయంలోనూ కేంద్రం ఇలానే వ్యవహరిస్తోందని మంత్రి ఆరోపించారు.

More Telugu News