కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఎన్నికలకు ముహూర్తం ఖరారు

  • నేడు ఢిల్లీలో సీడబ్ల్యూసీ సమావేశం
  • అక్టోబరు 17న కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు
  • సెప్టెంబరు 22న నోటిఫికేషన్
  • సెప్టెంబరు 7 నుంచి రాహుల్ భారత్ జోడో యాత్ర
  • తెలుగు రాష్ట్రాలకు సమన్వయకర్తల నియామకం
ఢిల్లీలో నేడు కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికలకు ముహూర్తం ఖరారు చేశారు. అక్టోబరు 17న కాంగ్రెస్ జాతీయ అధ్యక్ష పదవికి ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ ఎన్నికలకు సెప్టెంబరు 22న నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. 

కాగా, సీడబ్ల్యూసీ సమావేశానికి కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధినేత్రి సోనియా గాంధీ, పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వర్చువల్ గా హాజరయ్యారు. సోనియా వైద్య పరీక్షల కోసం విదేశాలకు వెళ్లగా, ఆమె వెంట రాహుల్, ప్రియాంక కూడా వెళ్లారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర వైఫల్యాలు చవిచూడడంతో ఏఐసీసీ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ రాజీనామా చేశారు. అప్పటి నుంచి సోనియానే తాత్కాలిక ప్రాతిపదికన పార్టీ నాయకత్వ బాధ్యతల్లో కొనసాగుతున్నారు.

భారత్ జోడో యాత్రకు తెలుగు రాష్ట్రాల సమన్వయకర్తలు వీరే...

త్వరలోనే కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేపడుతున్నారు. సెప్టెంబరు 7న ప్రారంభమయ్యే ఈ యాత్ర కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు సాగనుంది. కాగా, ఈ భారత్ జోడో యాత్ర 12 రాష్ట్రాల గుండా సాగుతుంది. ఈ నేపథ్యంలో, భారత్ జోడో యాత్రకు సంబంధించి ఆయా రాష్ట్రాలకు కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తలను నియమించింది. ఏపీకి డాలీ శర్మ, తెలంగాణకు ఎస్వీ రమణ సమన్వయకర్తలుగా వ్యవహరించనున్నారు.

Congress
President
Elections
CWC
Sonia Gandhi
Rahul Gandhi
Priyanka Gandhi
India

More Telugu News