గాయపడిన పాకిస్థాన్ స్టార్ బౌలర్ ను పరామర్శించిన టీమిండియా క్రికెటర్లు... వీడియో ఇదిగో!

  • రేపటి నుంచి ఆసియా కప్
  • ఎల్లుండి దాయాదుల సమరం
  • గాయంతో జట్టుకు దూరమైన షహీన్ అఫ్రిది
  • గాయం వివరాలు అడిగి తెలుసుకున్న భారత క్రికెటర్లు
ఆసియా కప్ క్రికెట్ టోర్నీ ఈ నెల 27 నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో జరగనుంది. ఈ నెల 28న భారత్, పాకిస్థాన్ సమరం జరగనుండడంతో అందరి దృష్టి ఈ మ్యాచ్ పై నిలిచింది. అయితే, పాకిస్థాన్ ప్రధాన ఫాస్ట్ బౌలర్ షహీన్ అఫ్రిదీ గాయంతో జట్టుకు దూరమయ్యాడు. ఈ మ్యాచ్ కు వేదికైన దుబాయ్ కి ఇరుజట్లు చేరుకుని ప్రాక్టీసు మొదలుపెట్టాయి. ఈ నేపథ్యంలో, మైదానంలో విశ్రాంతి తీసుకుంటున్న షహీన్ అఫ్రిదీని టీమిండియా క్రికెటర్లు పరామర్శించారు. 

యజువేంద్ర చహల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, కేఎల్ రాహుల్.... అఫ్రిదీని పలకరించి, అతడి గాయం వివరాలు తెలుసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను పాకిస్థాన్ క్రికెట్ వర్గాలు పంచుకున్నాయి. సోషల్ మీడియాలో ఈ వీడియో అందరినీ ఆకర్షిస్తోంది. 

కాగా, టీమిండియాతో సమరంలో షహీన్ అఫ్రిదీ లేకపోవడం పాక్ అవకాశాలపై ప్రభావం చూపిస్తుందని మాజీలు అభిప్రాయపడుతుండగా, పాక్ ప్రధాన కోచ్ సక్లాయిన్ ముస్తాక్ మాత్రం అతడి లోటు తెలియనివ్వని బౌలర్లు తమ జట్టులో ఉన్నారని అభిప్రాయపడ్డాడు. మహ్మద్ హస్నైన్, నసీం షా, హరీస్ రవూఫ్ లను ఎదుర్కోవడం టీమిండియాకు అంత తేలికకాదని అన్నాడు.

Shaheen Afridi
Injury
Team India
Pakistan
Asia Cup

More Telugu News