చైనా క్రికెటర్లను సానబట్టనున్న బెంగాల్ క్రికెట్ సంఘం
- చైనాలోనూ క్రికెట్ పై ఆసక్తి
- చాంగ్ కింగ్ సిటీలో పోటీలు
- బెంగాల్ క్రికెట్ పెద్దలను కలిసిన చైనా బృందం
- త్వరలో ఎంవోయూపై సంతకాలు
- చైనా క్రికెటర్లకు మెరుగైన శిక్షణ ఇస్తామన్న సీఏబీ
కోల్ కతాలోని చైనా కాన్సుల్ జనరల్ ఝా లియు ఆధ్వర్యంలోని ముగ్గురు సభ్యుల చైనా బృందం బెంగాల్ క్రికెట్ సంఘం అధ్యక్షుడు అవిషేక్ దాల్మియాను ఈడెన్ గార్డెన్స్ లో కలిసింది. అవగాహన ఒప్పందం (ఎంవోయూ)పై చైనా బృందం ప్రతిపాదన చేసింది. చైనా క్రికెటర్లకు కోల్ కతాలో శిక్షణ ఇప్పించడమే ఈ ఒప్పందం వెనుక ప్రధాన ఉద్దేశం.
ఒప్పందం కుదిరితే బెంగాల్ క్రికెట్ సంఘం జట్టుకు, చైనా జట్టుకు మధ్య స్నేహపూర్వక మ్యాచ్ లు, మెరుగైన కోచ్ లతో శిక్షణకు అవకాశం ఉంటుంది. దీనిపై బెంగాల్ క్రికెట్ సంఘం అధ్యక్షుడు అవిషేక్ దాల్మియా స్పందిస్తూ, చైనా కూడా క్రికెట్ ఆడేలా ప్రోత్సహించడం, ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ క్రీడను విస్తరించడంలో భాగంగా బెంగాల్ క్రికెట్ సంఘం నుంచి సహాయసహకారాలు అందిస్తామని హామీ ఇచ్చామని వెల్లడించారు.