upi: యూపీఐ చెల్లింపులపై ఛార్జీలు విధించం: కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టీకరణ

  • డిజిటల్ చెల్లింపులపై ఛార్జీలు వేస్తారని కొన్ని రోజులుగా ప్రచారం
  • వీటిపై జీరో మర్చండ్ డిస్కౌంట్ రేట్ విధానాన్ని పునఃపరిశీలించాలని  ప్రభుత్వాన్ని కోరిన ఆర్బీఐ
  • అదనపు ఛార్జీలు విధించేది లేదని స్పష్టత నిచ్చిన కేంద్రం
UPI payments not to be charged clarifies Finance ministry

యూపీఐ చెల్లింపులపై అదనపు ఛార్జీలు విధించవచ్చని వస్తున్న వార్తలపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్) అనేది ప్రజలకు ప్రయోజనం అందిస్తున్న డిజిటల్ సేవ అని పేర్కొంది. ఈ సేవలకు ఎలాంటి ఛార్జీలు విధించే ప్రసక్తే లేదని ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. 

రికవరీ ఖర్చును ఇతర మార్గాల ద్వారా తీర్చాలని, దేశంలో డిజిటల్ చెల్లింపుల పర్యావరణ వ్యవస్థకు ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని అందించిందని పేర్కొంది. డిజిటల్ చెల్లింపులను మరింత ప్రోత్సహించేందుకు ఈ ఏడాది కూడా సహాయాన్ని ప్రకటించినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. దాంతో, చెల్లింపుల మౌలిక సదుపాయాలను నిర్వహించడానికి యూపీఐ లావాదేవీలకు అదనపు ఛార్జీని డిమాండ్ చేయవచ్చనే ఊహాగానాల మధ్య స్పష్టత వచ్చింది. 

ఈనెల 17న విడుదల చేసిన చర్చా పత్రం ప్రకారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ అంశానికి సంబంధించిన అభిప్రాయాన్ని కూడా కోరింది. యూపీఐ లావాదేవీలు మాత్రమే కాకుండా ఐఎంపీఎస్, నెఫ్ట్, ఆర్టీజీఎస్, రూపే వంటి లావాదేవీలను ఇందులో ప్రస్తావించింది. రూపే, యూపీఐ లావాదేవీలపై అమలులో లేని జీరో-ఎండీఆర్ (మర్చంట్ డిస్కౌంట్ రేట్) విధానాన్ని పునఃపరిశీలించాలని ప్రభుత్వాన్ని కోరింది. 

ఎండీఆర్ రూపంలో డిజిటల్ చెల్లింపులపై విధించే రుసుము ద్వారా సర్వీస్ ప్రొవైడర్లు తాము వ్యవస్థలను మెరుగుపరచగలమని వాదిస్తున్నారు. దేశంలోని డిజిటల్ చెల్లింపుల పర్యావరణ వ్యవస్థకు సంబంధించిన పరిశ్రమల సంస్థ అయిన పేమెంట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఐసీఐ) కూడా యూపీఐ, రూపే డెబిడ్ కార్డులపై అమలు చేస్తున్న జీరో ఎండీఆర్ విధానాన్ని వెనక్కి తీసుకోవాలని కేంద్ర బడ్జెట్ -2022 సమర్పణకు ముందు ప్రభుత్వానికి లేఖ రాసింది. 

ప్రస్తుతం వీసా, మాస్టర్‌కార్డ్ డెబిట్ కార్డ్‌లపై 0.4 నుంచి 0.9 శాతం ఎండీఆర్ చార్జీలు వేస్తున్నారు. వీటిని సదరు బ్యాంకులు, వినియోగదారులు భరిస్తున్నారు. ఈ నేపథ్యంలో యూపీఐల విషయంలో వీసా, మాస్టర్ కార్డ్ డెబిట్‌కు భిన్నంగా వ్యవహరించాలా? వద్దా? అనే దానిపై ఆర్బీఐ కేంద్రం అభిప్రాయాన్ని కోరింది. స్పందించిన కేంద్రం ఆర్థిక మంత్రిత్వ శాఖ.. ఆర్థిక, వినియోగదారు-స్నేహపూర్వకమైన డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహిస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.

More Telugu News