Anand Sharma: కాంగ్రెస్ పార్టీ కేవలం ఆ రెండు పేర్లకే పరిమితమయిందా?: ఆనంద్ శర్మ సంచలన వ్యాఖ్యలు

  • కాంగ్రెస్ పార్టీలో ముందు నుంచీ ఉన్నామన్న ఆనంద్ శర్మ 
  • ఎప్పుడూ రాహుల్, ప్రియాంకా గాంధీల గురించే ఎందుకు మాట్లాడతారని ప్రశ్న 
  • తాను జీవితకాలం కాంగ్రెస్ వ్యక్తిగానే ఉంటానని స్పష్టీకరణ 
Is Congress Confined To 2 Names asks Anand Sharma

కాంగ్రెస్ పార్టీ తీరుపై ఆ పార్టీకి చెందిన పలువులు సీనియర్లు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో సమూల ప్రక్షాళన జరగాలంటూ 23 మంది సీనియర్లు రెండేళ్ల క్రితమే సోనియాగాంధీకి లేఖ రాసిన సంగతి తెలిసిందే. వీరిలో కేంద్ర మాజీ మంత్రి ఆనంద్ శర్మ కూడా ఉన్నారు. ఇటీవల ఆయన హిమాచల్ ప్రదేశ్ స్టీరింగ్ కమిటీ చీఫ్ పదవికి రాజీనామా చేశారు. 

తాజాగా ఆనంద్ శర్మ మీడియాతో మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీలో తొలి నుంచి తమలాంటి వాళ్లందరం ఉన్నామనీ, ఈ పార్టీ తమకు చెందినదని అన్నారు. 'ఎందుకు ఎప్పుడూ రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీల గురించే మాట్లాడతారు? కాంగ్రెస్ ఆ రెండు పేర్లకు మాత్రమే పరిమితమయిందా? ఇది కాంగ్రెస్ పార్టీ చరిత్రను అపహాస్యం చేసినట్టు కాదా?' అని ఆయన ప్రశ్నించారు. 

తాను జీవితకాలం కాంగ్రెస్ వ్యక్తిగానే ఉంటానని... అయితే, తన అంతరాత్మకు కట్టుబడే పని చేస్తానని చెప్పారు. ఆత్మగౌరవాన్ని చంపుకోలేకే స్టీరింగ్ కమిటీ ఛైర్మన్ పదవికి రాజీనామా చేశానని తెలిపారు. రాజీనామా చేయడం మినహా తనకు మరో దారి లేకపోయిందని చెప్పారు. తాను ఎందుకు రాజీనామా చేశాననే విషయం ఆమెకు (సోనియా గాంధీ) అర్థమయ్యే ఉంటుందని అన్నారు.

More Telugu News