Tadikonda: డొక్కా మాణిక్యవరప్రసాద్ నియామకంపై వైసీపీ ఎమ్మెల్యే ఆగ్రహం.. అర్ధరాత్రి సుచరిత ఇంటి వద్ద ఆందోళన

  • తాడికొండ నియోజకవర్గ అదనపు సమన్వయకర్తగా ‘డొక్కా’ నియామకం
  • ఎమ్మెల్యే శ్రీదేవిని అవమానించారంటూ కార్యకర్తల ఆగ్రహం
  • అర్ధరాత్రి వేళ సుచిరిత ఇంటి వద్ద కార్యకర్తల బైఠాయింపు
  • శ్రీదేవికి నచ్చజెప్పిన సుచరిత
vundavalli sridevi protest against own party leader sucharitha

వైసీపీ నేత డొక్కా మాణిక్యవరప్రసాద్‌ను తాడికొండ నియోజకవర్గ అదనపు సమన్వయకర్తగా నియమించడంపై ఆ పార్టీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఆగ్రహం వ్యక్తం చేశారు. గత అర్ధరాత్రి అనుచరులతో కలిసి జిల్లా అధ్యక్షురాలు మేకతోటి సుచరిత ఇంటి వద్ద ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. డొక్కాను నియమించి ఎమ్మెల్యేను అవమానించారంటూ శ్రీదేవి ఈ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ సుచరితకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

దీంతో స్పందించిన సుచరిత బయటకు వచ్చి ఎమ్మెల్యేకు నచ్చజెప్పారు. ఈ విషయంలో పార్టీ అధిష్ఠానంతో మాట్లాడదామని, అధిష్ఠానం ఎలా చెబితే అలా నడుచుకుందామని చెప్పడంతో శ్రీదేవి ఆందోళన విరమించారు. మరోవైపు, తాడికొండ నేతలు కూడా సుచరిత నిర్ణయంపై మండిపడుతున్నారు. పార్టీ అధినేత వైఎస్ జగన్‌తో మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నారు. 10 గంటల్లోగా పార్టీ తన నిర్ణయాన్ని మార్చుకోవాలని, లేదంటే నాలుగు మండలాల్లోని నాయకులందరం కలిసి రాజీనామా చేస్తామని హెచ్చరించారు. 

More Telugu News