Supreme Court: ఫుట్ బాల్ సమాఖ్యపై ఫిఫా నిషేధం ఎత్తివేసేందుకు క్రియాశీలకంగా వ్యవహరించండి: కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన

  • ఏఐఎఫ్ఎఫ్ పై ఫిఫా నిషేధం
  • బయటి వ్యక్తుల ప్రమేయం ఎక్కువగా ఉందంటూ అసంతృప్తి
  • అనిశ్చితిలో అండర్-17 మహిళల వరల్డ్ కప్
  • టోర్నీ భారత్ లోనే జరిగేలా చర్యలు తీసుకోవాలన్న సుప్రీం
Supreme Court suggests Center to take swift actions on FIFA ban

అఖిల భారత ఫుట్ బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్)పై ప్రపంచ ఫుట్ బాల్ సంఘం ఫిఫా నిషేధం విధించడం పట్ల సుప్రీంకోర్టు స్పందించింది. ఏఐఎఫ్ఎఫ్ పై ఫిఫా నిషేధం ఎత్తివేసేలా క్రియాశీలకంగా వ్యవహరించి, తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. తద్వారా మహిళల అండర్-17 వరల్డ్ కప్ షెడ్యూల్ ప్రకారం భారత్ లోనే జరిగేందుకు మార్గం సుగమం చేయాలని నిర్దేశించింది. జస్టిస్ డీవై చంద్రచూడ్, ఏఎస్ బోపన్న, జేబీ పార్ధీవాలాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం భారత్ ఫుట్ బాల్ వ్యవహారంపై దాఖలైన పిటిషన్ ను నేడు విచారించింది. 

కేంద్ర ప్రభుత్వం తరఫున విచారణకు హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా స్పందిస్తూ, కేంద్రం ఫిఫాతో సంప్రదింపులు జరుపుతోందని వెల్లడించారు. మహిళల అండర్-17 ఫిఫా వరల్డ్ కప్ ను భారత్ లోనే నిర్వహించేందుకు కృషి చేస్తున్నట్టు వివరించారు. ఇప్పటికే ఫిఫాతో రెండు పర్యాయాలు సమావేశాలు జరిగాయని, ఓ మోస్తరు సానుకూలత కనిపిస్తోందని కోర్టుకు నివేదించారు.

More Telugu News