తెలంగాణ-ఏపీ సరిహద్దులో పులి కలకలం!

Tiger that roaming AP and Telangana boarder Villages
  • ఖమ్మంపాడు-చిలుకూరు గ్రామాల మధ్య పులిని చూశామన్న వ్యవసాయ కూలీలు
  • అది అటువెళ్లడాన్ని తాము కూడా చూశామన్న ఎన్టీఆర్ జిల్లాలోని సరిహద్దు గ్రామ కూలీలు
  • అది హైనా అయి ఉండొచ్చంటున్న అటవీశాఖ అధికారులు
అడవులను వీడుతున్న పులులు గ్రామాల్లోకి వస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న ఘటనలు ఇటీవల తరచూ వెలుగు చూస్తున్నాయి. జూన్‌లో విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలంలో సంచరించిన పులి రెండు ఆవులపై దాడి చేసి ఓ దానిని చంపేసింది. గత నెలలో అనకాపల్లిలో ఓ పులి అటవీ అధికారులకు కంటిమీద కునుకు లేకుండా చేసింది. 

ఇక, మూడునాలుగు రోజుల క్రితం తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్‌రావు మండలం బొగ్గుల వాగు ప్రాజెక్టు సమీపంలో పులి సంచారం వార్తలు కలకలం రేపాయి. తాజాగా తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతమైన ఖమ్మం జిల్లా మధిర మండలం ఖమ్మంపాడు-చిలుకూరు గ్రామాల మధ్య పులి సంచరిస్తోందన్న వార్తలు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. పులి రోడ్డు దాటి పొలాల్లోకి వెళ్లడం చూశామని వ్యవసాయ కూలీలు కొందరు చెబుతున్నారు.  

మరోవైపు, ఎన్టీఆర్ జిల్లా వీరులపాడు మండలం అన్నవరం-దొడ్డ దేవరపాడు గ్రామాల మధ్య తాము పులిని చూసినట్టు మరికొందరు తెలిపారు. దీంతో సరిహద్దు గ్రామాల ప్రజలు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ఆ పులి రోడ్డు దాటి ఖమ్మం జిల్లా మధిర మండలంలోని ఖమ్మంపాడు-తొండలగోపవరం వైపు వచ్చినట్టుగా కూలీలు పేర్కొన్నారు. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు కూలీలు పులిని చూసినట్టుగా చెబుతున్న ప్రాంతాన్ని పరిశీలించారు. అయితే, వారు చెబుతున్నట్టు అది పులి అయి ఉండకపోవచ్చని, హైనా అయి ఉండొచ్చని చెబుతున్నారు.
Go Back to Shorts
Tiger
NTR Dist
Khammam District

More Telugu News