సల్మాన్ ఖాన్ చేతుల్లో ప్రాణాలు కోల్పోయిన కృష్ణ జింకకు స్మారక చిహ్నం

Memorial for blackbuck allegedly killed by Salman
  • సల్మాన్ ఖాన్ ను ఇప్పటికీ వెంటాడుతున్న జింకల కేసు
  • సల్మాన్ పై బిష్ణోయ్ ల న్యాయపోరాటం
  • కంకణి గ్రామంలో జింకకు ఆలయం
  • భావితరాలకు చైతన్యం కలిగించేందుకేనన్న బిష్ణోయ్ లు

ఇరవై నాలుగేళ్ల నాటి కృష్ణజింకల వధ కేసు బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కు ఓ మచ్చలా మిగిలిపోయింది. ఆ కేసు ఇప్పటికీ కొనసాగుతోంది. రాజస్థాన్ లోని జోథ్ పూర్ వద్ద 'హమ్ సాథ్ సాథ్ హై' సినిమా షూటింగ్ జరుగుతుండగా, సహనటులతో కలిసి వేటకు వెళ్లిన సల్మాన్ ఖాన్ పలు కృష్ణ జింకలను కాల్చిచంపినట్టు అభియోగాలు ఎదుర్కొంటున్నాడు. 

నాడు సల్మాన్ వేటకు వెళ్లిన ప్రాంతంలో బిష్ణోయ్ సామాజిక వర్గం ప్రాబల్యం ఎక్కువ. బిష్ణోయ్ లు వన్యప్రాణులను ప్రాణాలకంటే మిన్నగా ప్రేమిస్తారు. జంతువులను చంపినవారిని వారు ఏమాత్రం క్షమించరు. కృష్ణజింకల వధ వ్యవహారంలో సల్మాన్ ఖాన్ పై న్యాయపోరాటం చేస్తున్నది వాళ్లే. 

కాగా, నాడు సల్మాన్ ఖాన్ తుపాకీ గుళ్లకు బలైన కృష్ణజింకలకు భారీ ఎత్తున స్మారక చిహ్నం నిర్మించాలని బిష్ణోయ్ సామాజిక వర్గం నిర్ణయించింది. జోథ్ పూర్ ప్రాంతంలోని కంకణి గ్రామం వద్ద ఓ ఆలయ నిర్మాణం చేపట్టనున్నారు. ఆలయం వద్ద 800 కిలోల బరువుతో 3 అడుగుల కృష్ణ జింక విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ విగ్రహానికి అసలైన జింక కొమ్ములనే అమర్చనున్నారు. నాడు, కృష్ణజింక విగతజీవిగా కనిపించిన చోటే ఈ స్మారక చిహ్నం నిర్మిస్తున్నారు. 

అంతేకాదు, గాయపడిన జంతువులు, పక్షులకు చికిత్స అందించేందుకు ఇక్కడే ఓ సంరక్షణ కేంద్రాన్ని కూడా నిర్మిస్తున్నారు. రాబోయే తరాలకు వన్యప్రాణుల సంరక్షణ పట్ల చైతన్యం కలిగించడం కోసమే ఈ స్మారక కట్టడం నిర్మిస్తున్నామని బిష్ణోయ్ వర్గ ప్రతినిధి, మాజీ ఎంపీ జశ్వంత్ సింగ్ బిష్ణోయ్ వెల్లడించారు.
Go Back to Shorts
Blackbuck
Memorial
Salman Khan
Kankani
Bishnoi
Rajasthan

More Telugu News