Indiatoday: ఇండియా టుడే-సీ ఓటర్ సర్వేలో ఆసక్తికర ఫలితాలు.... కేంద్రంలో మళ్లీ మోదీనే.. తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి ఎలా ఉందంటే...!

Public Pulse in India
షార్ట్స్‌లో చూడండి
మరో రెండేళ్లలో దేశంలో సార్వత్రిక ఎన్నికలు రానున్నాయి. ఇప్పటి నుంచే రాజకీయ సమీకరణాలపై చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో జాతీయ మీడియా సంస్థ ఇండియా టుడే, సీ ఓటర్ సంస్థతో కలిసి చేపట్టిన జాతీయస్థాయి సర్వేలో ఆసక్తికర ఫలితాలు వెల్లడయ్యాయి. ఏపీలో అత్యధిక శాతం ప్రజలు సీఎం జగన్ నాయకత్వంలోని వైసీపీకే మద్దతుగా నిలుస్తారని సర్వే చెబుతోంది. 

అయితే, 2019 కంటే ఈసారి కొన్ని సీట్లు తగ్గుతాయని వెల్లడించింది. కిందటిసారి వైసీపీ ఏపీలో 22 ఎంపీ స్థానాలు నెగ్గగా, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 18 సీట్లు మాత్రమే వస్తాయని తెలిపింది. వైసీపీ ఖాతాలోని ఆ 4 స్థానాలు టీడీపీ కైవసం చేసుకుంటుందని పేర్కొంది. అదే సమయంలో వైసీపీకి 127 అసెంబ్లీ స్థానాలు లభిస్తాయని సర్వే వివరించింది. మునుపటి ఎన్నికల్లో వైసీపీకి 151 అసెంబ్లీ స్థానాలు దక్కడం తెలిసిందే. 

ఇక తెలంగాణ విషయానికొస్తే... ఇప్పుడు ఎన్నికలు జరిగితే బీజేపీ పుంజుకుంటుందని ఇండియాటుడే-సీ ఓటర్ సర్వేలో వెల్లడైంది. ప్రస్తుతం బీజేపీకి తెలంగాణలో 4 ఎంపీ సీట్లు ఉండగా, వచ్చే ఎన్నికల్లో 6 స్థానాల్లో గెలిచే అవకాశం ఉందని వివరించింది. అధికార టీఆర్ఎస్ కు 8, కాంగ్రెస్ కు 3 స్థానాలు లభించవచ్చని వెల్లడించింది. 

కేంద్రంలో పరిస్థితులపైనా సర్వే దృష్టి సారించింది. మోదీ నాయకత్వంవైపే అత్యధికులు మొగ్గుచూపుతారని, కానీ 2019లో వచ్చిన సీట్ల కంటే ఈసారి బీజేపీకి సీట్లు తగ్గుతాయని పేర్కొంది. గత ఎన్నికల్లో బీజేపీ 303 సీట్లు చేజిక్కించుకోగా, ఈసారి 286 సీట్ల వరకు వచ్చే అవకాశం ఉందని సర్వే వెల్లడించింది. 

అయితే, కాంగ్రెస్ బలం మరింత ఇనుమడిస్తుందని, గత ఎన్నికల్లో 52 స్థానాలకే పరిమితమైన కాంగ్రెస్, ఇప్పుడు 146 వరకు సీట్లను గెలిచే అవకాశాలు ఉన్నాయని ఇండియాటుడే-సీ ఓటర్ సర్వే వివరించింది. కానీ, రాహుల్ గాంధీని ప్రధానిగా 9 శాతం మందే కోరుకుంటున్నారట. మోదీ ప్రధానిగా ఉండాలంటూ 53 శాతం మంది కోరుకుంటున్నారని సర్వే తెలిపింది. ఇండియా టుడే-సీ ఓటర్ సంస్థలు ఈ సర్వేని ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఆగస్టు మధ్యలో చేపట్టాయి.

ఈ ఏడాది ఆరంభంలోనూ ఇలాంటి సర్వేనే ఇండియా టుడే చేపట్టింది. అప్పటికి, ఇప్పటికి పెద్దగా మార్పేమీ కనిపించలేదు. ఏపీలో బీజేపీ, కాంగ్రెస్ కు సీట్లు వచ్చే పరిస్థితి లేదని, మరోసారి పోటీ ప్రధానంగా వైసీపీ, టీడీపీ మధ్యనే ఉంటుందని నాటి సర్వేలో వెల్లడించారు.
Go Back to Shorts
Indiatoday
C Voter
Survey
Andhra Pradesh
Telangana
Narendra Modi
India

More Telugu News