Congress: పెరుగుతున్న ధరలు, నిరుద్యోగంపై కాంగ్రెస్ ఫైర్.. ఆగస్టు 5న దేశవ్యాప్త నిరసన

  • పార్లమెంటు నుంచి రాష్ట్రపతి భవన్ వరకు ర్యాలీ
  • అక్కడి నుంచి వెళ్లి ప్రధాని నివాసం ముట్టడికి ప్రణాళిక
  • రాష్ట్రాల్లో గవర్నర్ల నివాసాలను ముట్టడించనున్న కాంగ్రెస్ నేతలు
Congress to hold nationwide protest on August 5 over price rise

దేశంలో పెరిగిపోతున్న నిరుద్యోగం, ఆకాశాన్నంటుతున్న ధరలకు నిరసనగా ఆగస్టు 5న దేశవ్యాప్త నిరసనలకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతోంది. పార్లమెంటు ఉభయ సభల్లో కాంగ్రెస్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న నేతలు ఆ రోజున తొలుత పార్లమెంటుకు చేరుకుని అక్కడి నుంచి ర్యాలీగా బయలుదేరి రాష్ట్రపతి భవన్‌కు చేరుకుని అక్కడ నిరసన తెలుపుతారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి ప్రధాని నివాసానికి చేరుకుని ముట్టడిస్తారు. అలాగే, ఆయా రాష్ట్రాల్లో గవర్నర్ల నివాసాలను కాంగ్రెస్ నేతలు చుట్టుముట్టి నిరసన తెలుపుతారని ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి.

కాగా, జీఎస్టీ, నిత్యావసరాలు, ఇంధన ధరల పెరుగుదను వ్యతిరేకిస్తూ పార్లమెంటు ఉభయ సభల్లో విపక్షాలు గళమెత్తుతూ అధికార పార్టీపై విమర్శలు ఎక్కుపెడుతున్నాయి. ప్లకార్డులు చేతపట్టి నిరసన తెలుపుతున్నాయి. దీంతో సభా కార్యకలాపాలకు అంతరాయం కలిగిస్తున్నారంటూ వివిధ పార్టీలకు చెందిన 19 మంది రాజ్యసభ్యులు, నలుగురు కాంగ్రెస్ లోక్‌సభ సభ్యులును స్పీకర్ సస్పెండ్ చేశారు. అలాగే, పార్లమెంటు బయట నిరసన తెలిపిన ఎంపీలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

More Telugu News