పూడిమడక తీరంలో విద్యార్థుల గల్లంతు ఘటన.. మరో రెండు మృతదేహాలు వెలికితీత

  • బీచ్‌లో గల్లంతైన అనకాపల్లి డైట్ కాలేజీ విద్యార్థులు
  • సముద్రంలో తేలుతున్న రెండు మృతదేహాలను గుర్తించి ఒడ్డుకు చేర్చిన వైనం
  • మిగతా ముగ్గురి కోసం కొనసాగుతున్న గాలింపు
అనకాపల్లి జిల్లా పూడిమడక బీచ్‌లో స్నానాలకు దిగి గల్లంతైన ఐదుగురు విద్యార్థుల్లో ఇద్దరి మృతదేహాలను గుర్తించి ఒడ్డుకు చేర్చారు. దీంతో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య మూడుకు పెరిగింది. అనకాపల్లి డైట్ కాలేజీకి చెందిన 15 మంది విద్యార్థులు నిన్న పూడిమడక బీచ్‌కు చేరుకుని స్నానాలకు సముద్రంలో దిగారు. అయితే, ఒక్కసారిగా ఎగసిపడిన కెరటాలు వారిని సముద్రంలోకి లాక్కెళ్లాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, కొన ఊపిరితో ఉన్న మరో విద్యార్థిని మత్స్యకారులు రక్షించారు.  మరో ఐదుగురు కొట్టుకుపోయారు.

సమాచారం అందుకున్న వెంటనే రెండు నేవీ హెలికాప్టర్లు, నాలుగు బోట్లతో కోస్ట్‌గార్డ్ సిబ్బంది, మెరైన్ పోలీసులు మత్స్యకారుల సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో నీటిపై తేలుతున్న రెండు మృతదేహాలను ఈ ఉదయం గుర్తించి హెలికాప్టర్ ద్వారా వాటిని ఒడ్డుకు చేర్చారు. వీరిని గోపాలపట్నం, తూచికొండకు చెందిన విద్యార్థులుగా గుర్తించారు. గల్లంతైన మిగతా ముగ్గురు విద్యార్థుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

Pudimadaka Beach
Anakapalle
Students Missing
Andhra Pradesh

More Telugu News