మాల్దీవుల్లోనూ అదే సీన్... పొరుగుదేశం పారిపోయినా గొటబాయను వదలని నిరసనలు

Protests against Gotabaya in Maldives
స్వదేశంలో ఆందోళనలకు భయపడి మాల్దీవులకు పారిపోయిన శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్సకు పరాయిగడ్డపైనా నిరసన సెగ తప్పలేదు. వాయుసేనకు చెందిన విమానంలో భార్య, ఇద్దరు బాడీగార్డులతో కలిసి గొటబాయ మాలే నగరం చేరుకోవడం తెలిసిందే. అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తానన్న ఆయన ఇప్పటికీ పదవిలోనే కొనసాగుతున్నారు. 

ఈ నేపథ్యంలో, గొటబాయ రాజపక్సకు వ్యతిరేకంగా మాల్దీవుల్లోని శ్రీలంక జాతీయులు నిరసనలు తెలియజేశారు. మాలే నగరంలో శ్రీలంక జాతీయ పతాకం చేతబూని గొటబాయకు, శ్రీలంక ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వారు ప్రదర్శన నిర్వహించారు. రాజపక్సను తిరిగి శ్రీలంకకు పంపించివేయాలంటూ డిమాండ్ చేశారు. 

కాగా, తమ దేశంలోకి శ్రీలంక అధ్యక్షుడు గొటబాయను అనుమతించడంపై మాల్దీవ్స్ నేషనల్ పార్టీ (ఎంఎన్ పీ) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. శ్రీలంక ప్రజల మనోభావాలను మాల్దీవుల ప్రభుత్వం ఏమాత్రం పరిగణనలోకి తీసుకోలేదని ఎంఎన్ పీ నేత దున్యా మౌమూన్ విమర్శించారు. దీనిపై ప్రభుత్వం నుంచి వివరణ కోరుతూ తీర్మానం ప్రవేశపెడతామని స్పష్టం చేశారు.
Go Back to Shorts
Gotabaya Rajapaksa
Protests
Maldives
Sri Lanka

More Telugu News