సామాజిక న్యాయం కోసం ముర్మును బలపరచాలని నిర్ణయించాం: చంద్రబాబు

  • జులై 18న రాష్ట్రపతి ఎన్నికలు
  • ఎన్డీయే అభ్యర్థిగా ద్రౌపది ముర్మూ
  • రాజకీయ పక్షాల మద్దతు కోరుతున్న ముర్ము 
  • నేడు ఏపీకి వచ్చిన ద్రౌపది 
ఈ నెల 18న రాష్ట్రపతి ఎన్నికలు జరగనుండగా, ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ము దేశవ్యాప్తంగా పర్యటిస్తూ రాజకీయ పక్షాల మద్దతు కోరుతున్నారు. ఈ క్రమంలో ఆమె నేడు ఏపీకి విచ్చేశారు. అధికార వైసీపీ నేతలతో భేటీ అనంతరం ముర్ము విజయవాడ తాజ్ గేట్ వే హోటల్ లో టీడీపీ నేతలను కలిశారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఆమెకు సాదరంగా స్వాగతం పలికారు. 

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, పేద ఆదివాసీ కుటుంబంలో జన్మించిన ద్రౌపది ముర్ము ఎంతో కష్టపడి ఎదిగారని కొనియాడారు. సామాజిక న్యాయం కోసం రాష్ట్రపతి ఎన్నికల్లో ముర్మును బలపరచాలని టీడీపీ నిర్ణయించిందని చంద్రబాబు వెల్లడించారు. గిరిజనులను, ఆదివాసీలను అభివృద్ధి చేయడం అరుదుగా జరుగుతుంటుందని అన్నారు. ఈ దిశగా రాష్ట్రపతి అభ్యర్థిగా ముర్మును ఎంపిక చేయడం హర్షణీయమని ప్రధాని మోదీకి అభినందనలు తెలిపారు. ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము ఎన్నికలో భాగస్వామ్యం కావడం అందరి అదృష్టంగా భావిస్తున్నామని చంద్రబాబు తెలిపారు. 

కాగా, చంద్రబాబు ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్మును శాలువాతో సత్కరించి బుద్ధుని ప్రతిమను జ్ఞాపికగా అందజేశారు.

Chandrababu
Droupadi Murmu
Presidential Candidate
NDA
TDP
Andhra Pradesh

More Telugu News